మోదీ, చంద్రబాబు కలసి...ఎపిని ముంచారు:సిపిఎం రాఘవులు;సిపిఐ బంద్
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచారని సీపీఎం నేత రాఘవులు ధ్వజమెత్తారు. అన్నీ తెలిసి కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రాఘవులు ఆరోపించారు. ఏపీ పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను తెలుగు దేశం పార్టీ కప్పిపెడుతూనే వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
ఇప్పుడు చంద్రబాబు తెలివిగా తప్పును కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లూ ఊరించారు...అది ఉత్తిదే అని తేలిపోయిందన్నారు. బాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని రాఘవులు ఆరోపించారు.
మరోవైపు కేంద్రబడ్జెట్పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై ఈనెల 8న సీపీఐ రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.