కరోనాతో సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత: కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతోన్న కరోనా వైరస్ సామాన్యులనే కాదు.. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను వదలట్లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లలో ఉంటున్నారు. ఇదే క్రమంలో- కరోనా మహమ్మారి బారిన పడిన సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయనను తెలంగాణలోని భద్రాచలం నుంచి విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
కేంద్రంపై వైసీపీకి పెరుగుతోన్న పట్టు..ప్రాధాన్యత: విజయసాయి రెడ్డికి కీలక పదవి
భద్రాచలం నుంచి మూడుసార్లు..
ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. భద్రాచలం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. తెలంగాణలోని ఏటపాక, వర రామచంద్రాపురం మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. సున్నం రాజయ్య స్వగ్రామం సున్నంవారి గూడెం అందులో ఒకటి.
2019 ఎన్నికల్లో రంప నుంచి పోటీ..
చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి. ఆయా గ్రామాలన్నీ రాజకీయంగా సున్నంరాజయ్యకు మంచి పట్టు ఉన్నవి కావడంతో గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేశారు.
తొలుత నెగెటివ్.. అనంతరం పాజిటివ్
రెండువారాల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొదట్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో సాధారణ జ్వరంగా భావించి.. చికిత్స తీసుకుంటున్నారు. తన స్వగ్రామంలో నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనను విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Recommended Video
భద్రాచలం సీపీఎం కంచుకోటగా..
తెలంగాణలోని భద్రాచలం నియోజకవర్గాన్ని సీపీఎంకు కంచుకోటగా మార్చారు సున్నం రాజయ్య. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏజెన్సీ గ్రామాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలపై ఆయనకు మంచి పట్టు ఉండేది. ఎమ్మెల్యేగా గెలిచినా.. సామన్య జీవితాన్ని గడిపేవారు. ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే వారు. అసెంబ్లీ సమావేశాల కోసం ఆయన ఆటోలో వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన బైక్పై ప్రయాణించే వారు. సామాన్య జీవితాన్ని గడపడమే తనకు ఇష్టమని చెప్పేవారు.