"అరడుగుల బుల్లెట్ట్ ఎక్కడ దాక్కున్నాడు?"
కాకినాడ: ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఆరడుగుల బుల్లెట్ ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నాడని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి మధు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆయన అనుచరులు దాడి చేశారనే ఆరోపణలపై మధు ఆ విధంగా స్పందించారు.
ఒక్క పార్టీకి, ప్రభుత్వానికి అశోక్ బాబు వత్తాసు పలకడం సరి కాదని ఆయన ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తహసీల్దార్ వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభాకర్ను అరెస్టు చేయకపోతే కృష్ణా జిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. చింతమనేని ప్రభాకర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు.
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో శనివారం హైదరాబాదులో జరిగిన చర్చల్లో వివాదం సద్దుమణిగింది. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు రెవెన్యూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు రాజమండ్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.