జగన్కు రివర్స్.. 'ముస్లీంలు, క్రైస్తవుల ఆగ్రహం', చంద్రబాబుకు షాకేనా?
ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఎం నేత మధు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఎం నేత మధు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తానని చెప్పడం జగన్ది పచ్చి అవకాశవాదమని నిప్పులు చెరిగారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి మద్దతిస్తానని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు.
ఇప్పటికే జగన్పై ముస్లీంలు, క్రైస్తవుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మధు ఆగ్రహించారు. బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించడంతో అధి మరింత ఎక్కువ అవుతుందన్నారు.
జగన్ మద్దతు ఎలా ఇస్తారు?
ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చకుండానే ఆ పార్టీకి జగన్ ఎలా మద్దతు ఇస్తారని మధు నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపడం సరికాదని జగన్ చెప్పడం సరికాదన్నారు. అన్ని ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతోనే జగన్ పోటీకి పెట్టారా అని ప్రశ్నించారు.
ఏపీ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయా?
వైసిపి అధినేత జగన్ ప్రధాని మోడీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. హోదా మినహా బీజేపీతో ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దూరం కావాలని..
ఇప్పటికే పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి బీజేపీ నేతలు టిడిపికి దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రధానిని కలవడం... బీజేపీకి మద్దతిస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా?
వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ సాగుతోంది. బీజేపీని దూరం చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కానీ బీజేపీ నేతల్లో చాలామంది టిడిపికి దూరం కావాలనుకుంటున్నారు. టిడిపికి ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. జగన్తో కలిస్తే తమకు లాభిస్తుందని భావిస్తే అందుకు కూడా కమలం నేతలు సిద్ధంగానే ఉన్నారని అంటున్నారు. అప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు తిరిగి లెఫ్ట్ పార్టీలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను దరిచేర్చుకోవాల్సిందే అంటున్నారు. ఏం జరగనుందో నిలకడ మీద తెలుస్తుందంటున్నారు.