విభజనపై సిపిఎం: వైయస్ జగన్, చంద్రబాబు టార్గెట్?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను లక్ష్యం చేసుకునే ఉద్దేశంతో సిపిఎం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇటీవల సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన నిరాహార దీక్షలను ఆయన తప్పు పట్టారు. వారి డిమాండ్లలో అస్పష్టత ఉందంటూ ఆయన విమర్శించారు.
సమన్యాయం కావాలంటున్న జగన్ అదేమిటో చెప్తే బాగుండేదని రాఘవులు అన్నారు. అదే సమయంలో విభజన తీరు సరి కాదంటూ దీక్ష చేసిన చంద్రబాబు అది ఎలా ఉండాలో చెప్పకపోవడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్రకు ఏ విధమైన న్యాయం చేయాలో చంద్రబాబు చెప్పాల్సి ఉండిందని ఆయన అన్నారు. నిజానికి, చంద్రబాబు నాయుడు బిజెపి నేత నరేంద్ర మోడీతో వేదికను పంచుకోవడంపై సిపిఐతో పాటు సిపిఎం కూడా గుర్రుగా ఉంది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన వామపక్షాలు ఆయనకు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నాయి. దీంతోనే ఆయన ఢిల్లీ నిరాహార దీక్షా శిబిరానికి తెలుగుదేశం నాయకులు ఆహ్వానం పలికినా దూరంగా ఉన్నాయి. చంద్రబాబు రాజకీయ స్నేహం విషయంలో నమ్మదగిన నేతగా వారికి కనిపించడం లేదని అంటున్నారు.
కాగా, వైయస్ జగన్ ఎన్నికల ముందు ఏం మాట్లాడినప్పటికీ ఎన్నికల తర్వాత కాంగ్రెసుకు దగ్గరవుతారనే అంచనాతో వామపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్కు కూడా దూరంగానే ఉండాలని అవి భావిస్తున్నట్లు తెలుస్తున్నాయి. రాష్ట్ర విభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న సిపిఎంతో దోస్తీ కోసం సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వచ్చిన తర్వాత జగన్ ప్రయత్నించారు. అయితే, రాఘవులు అందుకు అంత సుముఖత వ్యక్తం చేయలేదు.
సమైక్యాంధ్రనే సిపిఎం కోరుకున్నప్పటికీ అది ప్రత్యక్షంగా సీమాంధ్రలో ఉద్యమానికి ముందుకు రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి అది సిద్ధంగా లేనట్లు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ, విభజన తర్వాత వైయస్ జగన్, చంద్రబాబులకు దూరంగా ఉంటూ, కాంగ్రెసును వ్యతిరేకిస్తూ రాజకీయంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో సిపిఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దశలో జగన్, చంద్రబాబులను కూడా లక్ష్యం చేసుకుని వామపక్ష రాజకీయాలకు పదును పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.