ఎమ్మెల్యే అంబటిని అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలు.. మహిళలను తొక్కుకుంటూ వెళ్లాడని ఆరోపణ...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో సీపీఎం కార్యకర్తల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే అంబటి రాంబాబును సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. సమావేశం జరుగుతున్న హాల్లోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వకుండా మెట్లపై బైఠాయించారు. చెత్త పన్ను,నీటి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అంబటి సీపీఎం కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో వారిని దాటుకుంటూ అంబటి లోపలికి వెళ్లిపోయారు. ఈ చర్యను సీపీఎం కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
మెట్లపై కూర్చొన్న మహిళా కార్యకర్తలను తొక్కుకుంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు లోపలికి వెళ్లారని సీపీఎం కార్యకర్తలు ఆరోపించారు. దీంతో కొంతమంది మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో చెత్త పన్ను,నీటి పన్ను తీర్మానాలు చేయవద్దని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కానీ ఎమ్మెల్యే అంబటి అందుకు అంగీకరించలేదన్నారు. అంబటి తమ కార్యకర్తలను తొక్కుకుంటూ వెళ్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు
పోలీసులు సీపీఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వైసీపీ దౌర్జన్యం,అరాచకం నశించాలి అంటూ సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేశారు.
అంతకుముందు,అంబటి రాంబాబు సీపీఎం కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ... చెత్త పన్ను,నీటి పన్ను ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే మున్సిపల్ కార్యాలయం వెలుపల చేయాలని అంతే కానీ ఇలా లోపలికి వచ్చి మెట్లపై అడ్డుగా కూర్చోవడమేంటని మండిపడ్డారు. సీపీఎం కార్యకర్తలు మెట్ల మీద నుంచి కదలకపోవడంతో అసహనంతో వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. తమను తొక్కుకుంటూ వెళ్లారన్న ఆరోపణలపై అంబటి స్పందించలేదు.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆస్తి పన్ను పెంపుతో పాటు చెత్త పన్నుపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో చెత్త పన్నుపై తీర్మానాలు చేశారు. ఇదే క్రమంలో సత్తెనపల్లి మున్సిపాలిటీలోనూ చెత్త పన్నుపై తీర్మానానికి శుక్రవారం(జులై 30) మున్సిపల్ కౌన్సిల్ సమావేశగా సీపీఎం కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు.