ఆ సంస్థలు చెప్పింది నిజమేనా..? కృష్ణా పుష్కరాల్లో నాణ్యత లోపాలు
విజయవాడ : ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ ఇటీవల నివ్వెరపోయే విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఏపీ అధికారుల వ్యవహార శైలి కూడా ఆరోపణలకు తావిస్తోంది. ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించిన అధికారుల అలసత్వ వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
మొన్నటికి మొన్న ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం కుంగిపోగా, తాజాగా కృష్ణా పుష్కరాల పనుల్లోను నాణ్యత లోపాలు బయటపడడం కలవరపెడుతోంది. నాసిరకం పనులతో డబ్బులు వెనుకేసుకుంటున్న కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణాల విషయంలో నాణ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా.. విజయవాడలో ప్రకాశం బారేజ్ దిగువగా నిర్మిస్తోన్న మహాఘాట్ పనుల్లో నాణ్యత లోపాలపై ఆరోపణలు వస్తున్నాయి.
సంచలనం రేపుతోన్న టైమ్స్ కథనం.. : 'కృష్ణా పుష్కరాల్లొ టీడీపీ భారీ అవినీతి'
కాగా, కనకదుర్గ వారధికి సమీపాన నిర్మిస్తోన్న మహాఘాట్, ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే బీటలు పారుతోంది. మహాఘాట్ కాంక్రీట్ బిడ్ నిలువునా బీటలు పారడం పనుల్లో లోపాలను ఎత్తి చూపిస్తోంది. ఇదిలా ఉంటే బీటలు పారిన కాంక్రీట్ బిడ్ ను కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ పగుళ్లను కనపడకుండా మేనేజ్ చేస్తోన్న కాంట్రాక్టర్లు పగుళ్లపై గోనె సంచులు కప్పినట్టుగా తెలుస్తోంది.
అయితే పగుళ్లను సరిచేస్తారా..? లేక పగుళ్లు అలా ఉండగానే, టైల్స్ వేసేయడం లాంటి మిగతా పనులు కూడా కానిచ్చేస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోన్న ప్రశ్న. ఇదిలా ఉంటే ఓవైపు కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లకు పైగా భారీ నిధులను విడుదల చేస్తే. నిర్మాణ పనులు మాత్రం అందుకు తగ్గట్టుగా జరగకపోవడం గమనార్హం. ఇదే విషయంపై ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కృష్ణా పుష్కరాల అవినీతిపై కథనం వెలువరించిన విషయం తెలిసిందే.