గవర్నర్ పరిశీలనలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్
రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్ సర్కార్ మొండిగా వెళ్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిని విస్మరించకూడదన్నారు. మంగళవారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్, ఇళ్లు కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై నేతలతో చర్చించారు.
గవర్నర్ పరిశీలనలో..
రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వారి చేసిన త్యాగాన్ని గుర్తించాలని, తమ పార్టీ రాజధాని రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పరిశీలనలో ఉన్నందున.. అన్నీ కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏం చేస్తారో...?
సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత.. రెండోసారి మండలిలో ఆమోదం పొందకుండానే నిరవధిక వాయిదా పడింది. అయితే మండలిలో బిల్లు పాస్ కాకుంటే పొందకుంటే నెల తర్వాత ఆమోదం పొందినట్టేనని భావిస్తారు. కానీ సీఆర్డీఏ రద్దు బిల్లు, రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ వద్దకు చేరింది. ఈ బిల్లులను ఆయన ఆమోదిస్తారా..? లేదంటే కేంద్రానికి పంపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందించారు.
కరోనాపై కామెంట్లు వద్దు
కరోనా సాధారణ జ్వరం వంటిదే... వస్తుంది, పోతుంది అంటూ కొందరు నిర్లక్ష్యంగా కామెంట్లు చేయడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని.. రోజు 4 వేల నుంచి 5 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ చేస్తున్నామని చెబుతున్నారని.. కానీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సరైన సేవలు ఎందుకు అందడం లేదు అని ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు, పడకలు, నాసిరకం ఆహారంపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు.
Recommended Video
పేదలకే చేటు
రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ పేదలను ఇబ్బందికి గురిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు తమ వర్గీయులకే కార్డులు ఇస్తున్నారని గుర్తుచేశారు. తమ వ్యతిరేకుల కార్డులను తొలగిస్తున్నారని చెప్పారు. ఈ విషయం తాను క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది చెప్పారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేషన్ డీలర్లకు కొన్ని విడతలు కమీషన్ చెల్లించకపోవడంతో.. వారు ఆందోళన చేపట్టారని తెలిపారు. దీంతో రేషన్ రాక పేదలు నష్టపోతున్నారని తెలిపారు. డీలర్ల సమస్యలను పరిష్కరించాలని పవన్ కల్యాణ్ కోరారు.