అమరావతి-బెంగుళూరు హైస్పీడ్ రైల్ లింక్: ప్రాధాన్యత ఇదే..!
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచి బెంగుళూరుకు హైస్పీడ్ రైలు ఏర్పాటు చేసే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మాస్టర్ ప్లాన్ను రూపొందించిన సింగపూర్ సంస్థ సీఆర్డీఏకి సూచించింది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఒక రాజధాని నుంచి మరో రాజధానిని అనుసంధానం చేస్తే ఈ ప్రాంతంలో వాణిజ్యం విస్తరిస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోడ్డు, రైలు మార్గాలే కాకుండా నేరుగా కనెక్టివిటీ ఉండాలని మాస్టర్ ప్లాన్లో స్పష్టం చేసింది. దీంతో సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనలు ప్రారంభించాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో దేశ వ్యాప్తంగా పేరుగాంచింది.
ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ తొలి నుంచి బెంగళూరుతో కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, అమరావతి మధ్య హైస్పీడ్ రైలు ప్రాజెక్టు చేపట్టాలని సూచించింది. దీనివల్ల ఈ రెండు రాజధానిల మధ్య వాణిజ్యం మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడుతోంది.
ఇప్పటికే ఈ రెండు రాజధానుల మధ్య నాలుగు లేదా ఆరు వరుసల రహదారిని నిర్మించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా బెంగుళూరుకి హైస్పీడ్ రైలు ప్రాజెక్టుని ప్రారంభించడం వల్ల రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఎనిమిది సిటీలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఎలక్ట్రానిక్స్ సిటీ. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏపీని హార్డ్వేర్ రంగానికి హబ్లాగా మార్చాలనే తలంపుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి భారీ సంఖ్యలో హార్డ్వేర్ పరిశ్రమలు రానున్నాయి.
అంతేకాదు అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఉత్పాదక శక్తితో పాటు వాణిజ్యం బాగా మెరుగుపడాలి. పైవన్నీ జరగాలంటే బెంగళూరుతో పాటు హైదరాబాద్తోనూ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరచాలని సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్లో సూచించింది. దీంతో హైదరాబాద్, అమరావతి మధ్యన హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుని సిఫార్సు చేసింది.