ఏపీ సీఎం నో కాంప్రమైజ్: అక్రమ నిర్మాణాల తొలిగింపు ప్రారంభం: చంద్రబాబు ఇల్లు కూడా తప్పదు!
ముఖ్యమంత్రి జగన్ ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గటం లేదు. అక్రమ నిర్మాణాల విషయంలో ముందుకే వెళ్తున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్వలు వచ్చినా డోన్ట్ కేర్ అంటున్నారు. కక్ష్య సాధింపులకు దిగుతున్నారనే అరోపణలు వస్తున్నా లెక్క చేయటం లేదు. కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాల తొలిగింపు కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా.. స్పందించని వారి విషయంలో సీఆర్ఢీఏ చర్యలు మొదలు పెట్టింది. కృష్ణా నదీ భూగర్బంలోకి చొచ్చుకు వెళ్లి నిర్మించిన పాతూరుకి చెందిన చప్టాను సీఆర్ఢీఏ అధికారులు కూల్చేసారు.
అదే విధంగా అక్రమ నిర్మాణాలను తొలిగించకుంటే ఖచ్చితంగా కూల్చివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని భవనానికి సైతం నోటీసులు జారీ చేసారు. వారం తరువాత ఆ భవనం పైన చర్యలు తీసుకోవటానికి సిద్దం అనే సంకేతాలు ఇస్తున్నారు. దీనిని మంత్రి బొత్సా సైతం స్పష్టం చేసారు. దీంతో..మరోసారి కరకట్ట రాజకీయం తెర మీదకు వస్తోంది.
కరకట్ట మీద ఆక్రమణల కూల్చివేత..
ఊహించిందే జరుగుతోంది. కరకట్ట మీద అక్రమ నిర్మాణాల విషయంలో రాజీ పడటం లేదు. తాజాగా కరకట్ట వద్ద కృష్ణా నదీ భూగర్భం లోపలికి చొచ్చుకెళ్లే విధంగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అయిదు ఎకరాల పొలం వద్ద అక్రమంగా కట్టిన చప్టాను సీఆర్డీఏ అధికారులు తొలిగిస్తున్నారు. దాదాపు 17 మీటర్ల పొడవు..7.4 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. దీని పైన నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో సీఆర్ఢీఏ అధికారులు స్పందించారు. ఆక్రమణలు తొలిగించే కార్యక్రమాలు మొదలు పెట్టారు. అదే విధంగా కరకట్ట మీద ఉన్న మరో నాలుగు నిర్మాణాల విషయంలో సీఆర్డీఏ అధికారులు ఇదే రకంగా వ్యవహరించబోతున్నారని సమాచారం. ఇదే సమయంలో చంద్రబాబు నివాసం గురించి చర్చ మొదలైంది.
చంద్రబాబు ఇంటిపై బొత్స క్లారిటీ
ఇక దశలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేస్తున్నారనే ప్రచారం సాగింది. అయితే, దీని పైన మంత్రి బొత్సా స్పందించారు. చంద్రబాబు నివాసం కూలగొట్టటం లేదని..ఇప్పటికే నోటీసులు జారీ చేసామని స్పష్టం చేసారు. అయితే..సీఆర్ఢీఏ నోటీసులు అందుకున్న వారు సరైన రీతిలో స్పందించక పోతే చర్యలు తప్పవని బొత్సా స్పష్టం చేసారు. వారి నిర్మాణాలు సక్రమం అయితే న్యాయస్థానానికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందు నుండి ఒకే విధంగా వ్యవహరిస్తోందని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. చంద్రబాబాబు ఇంకా అదే నివాసంలో ఉండటం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు నివాసం పైనే ఫోకస్...!
మూడు నెలలుగా సాగుతున్న చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం పైన మరోసారి చర్చ మొదలైంది. లింగమనేని రమేష్ కు చెందిన భవనంలో చంద్రబాబు అక్రమ నిర్మాణం అని తెలిసి ఉంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మూడు నెలల క్రితం ఆయన నివాసంకు సమీపంలోని ప్రజా వేదికను కూల్చివేసిన ప్రభుత్వం చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చింది. దీని పైన లింగమనేని రమేష్ సమాధానం ఇచ్చారు. దీని పైన విబేధించిన సీఆర్ఢీఏ అధికారులు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనంలోని నిర్మాణాలను వివరిస్తూ అవన్నీ అక్రమంగా నిర్మించినవే అంటూ ఈ నెల 19న తాజాగా మరోసారి నోటీసులు అంటించింది.
వారం రోజుల గడువు తర్వాతే
అంతేకాకుండా అక్రమ కట్టడాల కూల్చివేతపై వారం రోజులు సమయం ఇచ్చింది. వారం రోజుల్లోగా భవనం కూల్చివేయాలని..లేకుంటే తామే కూల్చివేస్తామని స్పష్టం చేసింది. దీనిపైన భవన యజమాని తాము అన్నీ అనుమతులతోనే నిర్మాణాలు చేసామని చెప్పుకొచ్చారు. తాజాగా మంత్రి బొత్సా సైతం మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నివాసం పైన ఇప్పటికే నోటీసులు ఇచ్చామని..అక్రమ నిర్మాణాలను కూల్చి వేయటం ఖాయమని పరోక్షంగా చంద్రబాబు నివాసం గురించి స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు మరోసారి చంద్రబాబు నివాసం చుట్టూ రాజకీయ రగడ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని పైన టీడీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.