గుడ్ టచ్.. బ్యాడ్ టచ్లపై...అమ్మాయిలకు అవగాహన:ఎస్పీ అశోక్కుమార్
అనంతపురం:గుడ్ టచ్.. బ్యాడ్ టచ్లపై అమ్మాయిలకు అవగాహన పెంచాలని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మహిళా రక్షక్ బృందాల పనితీరుపై ఆయన సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
అలాగే ఫోక్సో చట్టంపై కూడా అవగాహన పెంచాలన్నారు. దీనికోసం కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి చట్టాల గురించి వివరించాలన్నారు. మహిళా రక్షక్ బృందాలు, మహిళా పోలీసు వలంటీర్లు సంయుక్తంగా పని చేయాలన్నారు. మహిళా రక్షక్ బృందాలు జిల్లాలో నిఘా ఉంచి 57 మంది ఆకతాయిలను గుర్తించారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 55 ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి...గుడ్ టచ్.. బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర 116 ప్రాంతాల్లో నిఘా ఉంచామన్నారు. అనంతపురం సబ్ డివిజన్లో 17 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఆయన వివరించారు.
ఈ క్రమంలో ఒకరిపై కేసు నమోదు చేశామన్నారు. ధర్మవరంలో 21 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆరు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. పుట్టపర్తిలో ఆరు చోట్ల, పెనుకొండలో 8 చోట్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. కదిరి సబ్ డివిజన్లో 10 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.