సీజన్ లో నాలుగోసారి: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ ఎత్తివేత: కృష్ణాకు వరదపోటు!
కర్నూలు: ఈ వర్షాకాల సీజన్..రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయంగా గుర్తుండి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వర్షాకాల సీజన్ లో ఒకసారైనా వరదపోటును చవి చూడని కృష్ణా, గోదావరి నదులు.. మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా- ఈ నదిపై నిర్మించిన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గానీ, శ్రీశైలం రిజర్వాయర్ గానీ మరోసారి నిండిపోయాయి. నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద ప్రవాహంతో తొణికిసలాడుతున్నాయి. ఇన్ ఫ్లో భారీగా ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా జల వనరుల శాఖ అధికారులు గురువారం ఉదయం శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. వరద జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు. ఈ ఒక్క వర్షాకాల సీజన్ లోనే శ్రీశైలం గేట్లను ఎత్తేయడం ఇది నాలుగోసారి.
ఒక్క హైకోర్టు..మూడు ఉద్యమాలు: అటు రాయలసీమ.. ఇటు ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి!
మహారాష్ట్ర, కర్ణాటక, సీమల్లో భారీ వర్షాల ఎఫెక్ట్
ముంబై సహా మహారాష్ట్రలో కొంతకాలంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా కృష్ణానది మరోసారి వరద పోటుకు గురైంది. కృష్ణమ్మ జన్మస్థానమైన పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు కృష్ణా తీర ప్రాంతం పొడవునా అదే పరిస్థితి నెలకొంది. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోనూ వర్షాల ధాటికి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. తాజాగా రాయలసీమలో 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దీనికి తోడయ్యాయి. తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ వంటి కృష్ణా ఉపనదుల క్యాచ్ మెంట్ ఏరియాల్లో భారీ వర్షాల ప్రభావం చూపాయి.
జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ..
తెలంగాణలో ఇందిరా ప్రియదర్శిని జూరాల, ఏపీ పరిధిలోకి వచ్చే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల సహా ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణానదిపై నిర్మించిన అన్ని రిజర్వాయర్లు ఇప్పటికే నిండిపోయాయి. నీటి నిల్వ సామర్థ్యాన్ని అందుకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న భారీ వర్షాలు, వరదల వల్ల మరోసారి ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తోన్న వరద నీటికి అనుగుణంగా అధికారులు గేట్లను ఎత్తి, నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 6 గంటల సమయానికి 90 నుంచి లక్ష క్యూసెక్కుల మేర వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
లక్షా 50 వేల క్యూసెక్కులు దిగువకు..
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. గురువారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం 884 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లోను నిల్వ ఉంచడం వల్ల గరిష్ఠస్థాయికి మించి వరదనీరు ప్రవహించడం ఖాయమని అధికారులు వెల్లడించారు. అందుకే- నాలుగు గేట్లను ఎత్తుతున్నట్లు వెల్లడించారు. అడుగు మేర ఎత్తు వరకు గేట్లను ఎత్తారు లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు. ఇన్ ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు వదిలి వేస్తామని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ జిల్లాలకు వరద నీటిని మళ్లిస్తున్నారు.