శ్రీశైలానికి మళ్లీ వరద ఉధృతి: గేట్లు ఎత్తివేత
కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్ మరోసారి వరద పోటుకు గురైంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఇదివరకే గరిష్ఠ స్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్.. తాజాగా వచ్చి చేరుతున్న వరద నీటితో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో జల వనరుల శాఖ అధికారులు ఆదివారం తెల్లవారు జామున రిజర్వాయర్ గేట్లను ఎత్తేశారు.
మూడు గేట్లను అడుగు మేర ఎత్తి, వరద జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు. కృష్ణానదిపై తెలంగాణలో నిర్మించిన ఇందిరా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్ గేట్లను ఎత్తేయడం వల్ల శ్రీశైలానికి 24 గంటల వ్యవధిలో భారీగా వరద ప్రవాహం నమోదైంది.
శనివారం రాత్రి సమయానికి శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులే. నీటి మట్టం గరిష్ఠానికి చేరుకోవడం, ఇన్ ఫ్లో భారీగా ఉండటంతో దీనికి అనుగుణంగా గేట్లను ఎత్తి, నీటిని దిగువకు వదలుతున్నారు. ఈ సీజన్ లో గేట్లను ఎత్తేయడం ఇది ఆరోసారి.
ఎగువన కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వల్ల వరద పెరిగింది. తెలంగాణలో ఇందిరా ప్రియదర్శిని జూరాల, ఏపీ పరిధిలోకి వచ్చే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల సహా ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణానదిపై నిర్మించిన అన్ని రిజర్వాయర్లు ఇప్పటికే నిండిపోయాయి. నీటి నిల్వ సామర్థ్యాన్ని అందుకున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న భారీ వర్షాలు, వరదల వల్ల మరోసారి ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తోన్న వరద నీటికి అనుగుణంగా అధికారులు గేట్లను ఎత్తి, నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.
గురువారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం 884 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లోను నిల్వ ఉంచడం వల్ల గరిష్ఠస్థాయికి మించి వరదనీరు ప్రవహించడం ఖాయమని అధికారులు వెల్లడించారు. అడుగు మేర ఎత్తు వరకు గేట్లను ఎత్తారు. లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు. ఇన్ ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు వదిలి వేస్తామని తెలిపారు.