పోటెత్తిన తుంగభద్ర: సుంకేశుల గేట్లు ఎత్తివేత..శ్రీశైలానికి మరింత వరద ప్రవాహం
కర్నూలు: కర్నూలు జిల్లా వరప్రదాయినిగా పేరున్న తుంగభద్ర నది పోటెత్తుతోంది. ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన బ్యారేజీ జల హోరును సంతరించుకుంది. వరదనీరు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో జిల్లా భారీ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం ఈ ఆనకట్ట గేట్లను ఎత్తివేశారు. మొత్తం 30 గేట్లు ఉన్న ఈ ఆనకట్టకు సంబంధించిన 26 గేట్లను అడుగు మేర పైకి ఎత్తివేశారు. 2,10,000 క్యూసెక్కుల తుంగభద్ర నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. మరో 1500 క్యూసెక్కుల జలాలను కర్నూలు-కడప కెనాల్ కు వదిలారు. ఫలితంగా- ఈ రెండు జిల్లాల్లో పంట పొలాలు జలాలతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని కలెక్టర్ జీ వీరపాండ్యన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎగువన ఉన్న కర్ణాటకలో తుంగ, భద్ర నదీ తీర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ రెండు నదుల్లో వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీనితో కర్ణాటకలోని హొస్పేట వద్ద నిర్మించిన టీబీ డ్యామ్ నుంచి దిగువకు జలాలను వదిలి వేస్తున్నారు. ఆ ప్రవాహం వల్ల జిల్లాలో సుంకేశుల వద్ద నిర్మించిన ఆనకట్ట నిండిపోయింది. సోమవారం రాత్రికి 2,15,000 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో నమోదైంది. మంగళవారం ఉదయానికి ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు.
దీనితో బ్యారేజ్ కు చెందిన 26 అడుగు మేర ఎత్తారు. దిగువన శ్రీశైలం రిజర్వాయర్ కు 2,10,000 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, కర్నూలు-కడప కెనాల్ కు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఫలితంగా- శ్రీశైలానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కర్నూలు పట్టణంలోకి ప్రవేశిస్తున్నాయి. కర్నూలు ఓల్డ్ టౌన్, జొహరాపురం, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాలలోకి బ్యాక్ వాటర్ ప్రవేశించాయి. ఇప్పటికే జొహరాపురం-ఓల్డ్ టౌన్ మధ్య వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.