నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్, ట్విస్ట్: ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్న బెట్టింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బెట్టింగ్ వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలని ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్న బెట్టింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బెట్టింగ్ వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలని ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.
ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్లకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సెక్షన్ 160 కింద ఓ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఎమ్మెల్యేలు స్పందించారు. తమను సాక్షులుగా పిలిచారన్నారు.
కాగా, శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు. నెల్లూరుతో పాటు కోవూరు, పొదలకూరు, మనుబోలు, గూడూరు, మరికొన్ని ప్రాంతాల్లో క్రికెట్ బుకీలు, పంటర్లను అరెస్టులు చేశారు.
వారి వద్ద భారీగా నగదు, సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి బెట్టింగ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పక్కా సమాచారంతో ఎప్పటికప్పుడు బెట్టింగు రాయుళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ బుకీ సహా పలువురు బుకీలు, 120 మందికి పైగా పంటర్లను అరెస్టు చేశారు. తాజాగా, శనివారం దాడులు నిర్వహించి మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
క్రికెట్ బెట్టింగుల విషయంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 300కి పైగా పంంటర్లను అరెస్టు చేశారు. బుకీలతో సంబంధాలు కొనసాగిస్తూ, పందేల్లో పాల్గొంటున్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇంకా కొందరు పంటర్లు అజ్ఞాతంలోకి వెళ్లారని దర్యాప్తులో తేలింది. మరికొందరు ఇతర రాష్ట్రాలకు మకాం మార్చారు. వారిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.