క్రికెట్ బెట్టింగ్: కొడుకు కొట్టాడని పేరెంట్స్ ఆత్మహత్య
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని తల్లిదండ్రుల పైన చేయి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. బెట్టింగులకు పాల్పడవద్దని, జీవితం నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులు హెచ్చరించడంతో అతను వారి పైన చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మురికివూడి గ్రామానికి చెందిన హరిబాబు, నాగేంద్ర దంపతులకు శ్రీహరి అనే కొడుకు ఉన్నాడు. ఇతను క్రికెట్ బెట్టింగులలో పాల్గొంటూ ఇల్లును గుల్ల చేస్తున్నాడు. గురువారం అతనిని మరోమారు మందలించారు.
దీంతో అతను తల్లిదండ్రుల పైన చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన హరిబాబు, నాగేంద్రలు ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్కు దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు బుకీలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలోనే గురువారం ఒక్క రోజే కోట్లాది రూపాయల బెట్టింగుకు రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి.
హైటెక్ పద్ధతుల్లో ఈ తంతు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుకీల ఆట కట్టించేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారన్నారు. బెట్టింగ్ గ్యాంగ్ లీడర్ గౌస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు.