హైకోర్టు జడ్డిలపై సోషల్ కామెంట్స్- నందిగం సురేష్, ఆమంచి సహా 49 మందికి నోటీసులు
ఏపీలో తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వరుసగా వెలువడుతున్న తీర్పులు న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య చిచ్చురేపేలా కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన తీర్పులపై సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై న్యాయవాది లక్ష్మీనారాయణ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సుమోటో విచారణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది.
తాజాగా వెలువడిన తీర్పుల నేపథ్యంలో హైకోర్టు జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఎంపీ సురేష్ తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సురేష్ తో పాటు ఆమంచి కూడా బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆమంచి అయితే ఓ అడుగు ముందుకేసి కరోనా లాక్ డౌన్ లేకపోతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టే వాడినంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.