రాజధానిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భూదందా: క్రిమినల్ కేసు నమోదు
గుంటూరు: అమరావతిని నవ్యాంధ్ర నూతన రాజధానిగా ప్రకటించడంతో రాజధాని పరిధి ప్రాంతాల్లోని భూములుకు రెక్కులొచ్చాయి. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో భూ దందాలు మరితంగా ఎక్కువయ్యాయి. రాజకీయ నాయకుల నుంచి స్థానిక నేతల వరకు ఈ భూదందాల్లో తలదూర్చుతున్నారు.
తాజాగా గుంటూరు నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. నగరంలో సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించారన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే... నగరంలోని ప్రముఖ ప్రాంతంలో ఉన్న భూమని కబ్జా చేసుకునేందుకు చనిపోయిన స్టాంప్ వెండర్ పేరుతో నకిలీ స్టాంపులు తయారు చేయించాడు. అనంతరం ఆ నకిలీ డాక్యుమెంట్లతో భూమి యజమానిని మస్తాన్ వలీ బెదిరించినట్లుగా తెలుస్తోంది.
ఈ భూదందాపై గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో భూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు మస్తాన్ వలీతో పాటు భూకజ్జాకు సహకరించిన వారిపై క్రిమనల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద పోలీసులపై కేసు నమోదు అయింది. దీంతో ఆలస్యంగా మేలుకున్న పోలీసులు గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో పాటు భూకజ్జాకు పాల్పడిన అతడి అనుచరుడిపై క్రిమనల్ కేసు నమోదు చేశారు.