జేసీ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు: సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశం?
జేసీ బ్రదర్స్ కు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధమైంది . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్నీ ధృవీకరించారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు. అంతేకాదు జేసీ ట్రావెల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. దీంతో జేసీ బ్రదర్స్ మెడకు ప్రభుత్వం గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది.
దివాకర్ ట్రావెల్స్ పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయిన రవాణా శాఖ
ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలుతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడుతున్న దివాకర్ ట్రావెల్స్ పై ఉక్కు పాదం మోపటానికి రావాణా శాఖ సిద్ధం అయ్యింది . దీనిపై వన్టౌన్ పీఎస్లో జేసీపై ఫిర్యాదు చేసింది ఏపీ రవాణా శాఖ .సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని పేర్కొన్నారు.
సుప్రీం నిబంధనలకు వ్యతిరేకంగా నిషేధిత వాహనాలు
ఇక ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ జాయింట్ కమిషనర్ జేసీ ట్రావెల్స్ చేసిన అక్రమాలను పేర్కొన్నారు. సుప్రీం నిబంధలకు విరుద్ధంగా అక్రమంగా నిషేధిత వాహనాలను వినియోగించాయని చెప్పారు. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కిన జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాలో నిషేధిత వాహనాలను తెచ్చి వాటిని మార్చి విక్రయించారని పేర్కొన్నారు .
జేసీ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు ... 100 కోట్ల జరిమానా విధించే అవకాశం
ఇక అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. నాగాలాండ్లో బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారని, ఇక అనంతపురంలో అధికారులు గుర్తించిన 68 వాహనాల్లో ఆరు వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయని పేర్కొన్నారు . ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పారు . మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయని అధికారులు వెల్లడించారు .ఇక దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై మరింత లోతైన విచారణ చేస్తామని వెల్లడించారు . జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.