పోలీసుల ట్రాప్ లో నేరస్తులు చిక్కుతారు..! కానీ జయరాం కేసులో నేరస్తుల వలలో పోలీసులు చిక్కారు..!
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ ఉదంతం పోలీసులకు శరాఘాతాంలా పరిణమించింది. నేరస్తుడు గీసిన స్కెచ్ లో పోలీసు ఉన్నతాదికారులు పక్కాగా పడిపోయినట్టు నిర్ధారణ జరుగుతోంది. పోలీసుల వ్యూహాలకు నేరస్తులు చిక్కడం, అది సంచలనంగా మారడం సహజంగా జరుగుతుంటుంది. కాని ఇక్కడ నేరస్తుడు పోలీసులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వారిని ట్రాప్ లో ఇరికించే వరకు వరకు కధ నడింపించాడంటే వాడు సామాన్యుడు కాదని రాకేష్ రెడ్డి విషయంలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
సంచనంగా మారిన జయరాం మర్డర్ మిస్టరీ..! మరో రెండుమూడు రోజుల్లో కేసు కొలిక్కి..!!
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ మేనకోడలు ట్రాప్ లో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాదిరూపాయల ఆస్తి, మందీమార్బలం ఉన్నా చివరి క్షణంలో ఏవీ ఆదుకోలేకపోయాయి. పాతికేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యమే అతడి పాలిట మృత్యువుగా మారింది. కట్టలు తెంచుకున్న కోరికలు దీనికి ఆజ్యం పోసింది. ప్రవాస ఆంధ్రుడు చిగురుపాటి జయరామ్ మర్డర్ వెనుక పోలీసు అధికారుల ప్లాన్ ఉన్నట్టుగానే దర్యాప్తు అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఐతే పోలీసులు వేసిన వలలకు ఎంత పెద్ద నేరస్తులైనా ఎప్పుడో ఓ సారి పడిపోక తప్పదు. కాని జయరాం కేసులో నేరస్తుడి వలకు పోలీసులు చిక్కడం విశేషం..!
రాకేష్ రెడ్డి ట్రాప్ లో చిక్కిన పోలీసులు..! చాకచక్యంగా వ్యవహరించిన నేరస్తుడు..!!
కేసులో కీలక నిందితుడు రాకేష్రెడ్డి ఆస్తిపై ఆశతో జయరామ్ను హత్య చేశాడు. ఈ వ్యవహారంలో మరో నలుగురు అతడికి సాయం చేశారు. హత్యకు సహాయం చేసిన వారిలో రౌడీషీటర్లుంటే, దీనికి పక్కా యాక్షన్ ప్లాన్ గీసింది మాత్రం పోలీసులే కావడం కొసమెరుపు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, రాకేష్రెడ్డి విదిలించే కాసులు.. పంపే అమ్మాయిల కోసం ఇంత దారుణానికి తెగించటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను విచారించిన పోలీసులు ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగానే నిర్దారించుకున్నారు.
కాసులకు ఖాకీలు కక్కుర్తి..! అడ్డంగా బుక్కైన వైనం..!!
దీనికోసం ఎవరికి ఎంత ముట్టింది, ఏ పోలీసు అధికారి ఎంతకు ఆశపడ్డారనే వివరాలు మాత్రమే బయటకు రావాల్సి ఉందని సమాచారం. ఇక్కడ మరో విశేషమేమిటంటే, హత్యలో పాలుపంచుకున్న వారంతా ఈ మర్డర్తో లైఫ్ సెటిల్ చేసుకోవాలని భావించినవారే కావటం విశేషం. మరి పోలీసు యంత్రాంగం, కేసు విషయంలో ఎంతవరకూ సక్రమంగా దర్యాప్తునకు కట్టుబడి ఉంటారు. ఖాకీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉన్న విషయాలను బయటకు వెల్లడించగలరా అనే సందేహాలు కూడా లేకపోలేదు.
రాకేష్ పోలీసులతోనే చెలగాటం..! రక్తి కట్టించిన మర్డర్ నాటకం..!!
మరో ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తికి కూడా, ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందట. అందుకే, మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిన సదరు ఎమ్మెల్యే చివరిలో జయరామ్ మర్డర్తో ముడిపడటం వల్ల ఎమ్మెల్యేగానే మిగిలాడనే ప్రచారం జరుగుతుంది. అయితే, ఇదంతా కేవలం ఆరోపణలా, వాస్తవాలా! తెలంగాణ పోలీసుల విచారలనలో గాని బయటకు వచ్చే పరిస్థితి లేదు. సస్పెన్స్ క్రైమ్థ్రిల్లర్ ను మరిపిస్తున్న జయరామ్ మర్డర్ లో నేరస్తుడు గీసిన స్కెచ్ కి పోలీసులు ఇరుక్కున్నారనే చర్చ మాత్రం క్రైమ్ వర్గాల్లో తెగ నడుస్తోంది.