చట్టాలు చేయాల్సిన పెద్దలు చంటి పిల్లల్లా వ్యవహరించడం ఏంటి..?విమర్శల పాలవుతున్న ఏపి పెద్దల సభ.!
అమరావతి/హైదరాబాద్ : ఏపి కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల ఏపి ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాహితం మేరకు చట్టాలు చేయాల్సిన సభలో పరస్పరం దూషించుకోవడం, చంటి పిల్లల్లా కొట్టుకోవడం, అత్యంత హేయమైన చర్యలుగా అభివర్ణిస్తున్నారు. అంతే కాకుండా శాసన మండలికి ఎంపికయ్యే అభ్యర్థుల వయసు కూడా 45సంవత్సరాలు పైబడే ఉంటుందని, రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వారే ఇలాంటి పదవుల్లోకి వస్తారని, ఇలాంటి తరుణంలో చట్టసభల్లో అత్యంత హుందాగా వ్యవహరించాల్సిన శాసన మండలి సభ్యులు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారి లాగా లేదా మొదటిసారి ప్రజాప్రతినిధిగా చట్ట సభల్లోకి అడుగుపెట్టిన వారి లాగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి.
బండబూతులు.. ముష్టి ఘాతాలు.. ఏపి శాసన మండలిలో కాలకేయ ఫైటింగ్ సన్నివేశం..
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ చట్టసభల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, అరుచుకోవడం వంటి స్థాయి నుంచి ఘాటుగా దూషించుకోవడం, తోపులాట వరకూ వెళ్లిన వైనం పట్ల లోతైన చర్చ జరుగుతోంది. తాజాగా శాసన మండలిలో మరో అడుగు ముందుకు వేసిన అధికార, విపక్ష నేతలు పరస్పరం బౌతిర దాడులు చేసుకునే వరకూ వెళ్లడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీ మండలిలో అధికార, ప్రతినపక్ష సభ్యుల మధ్య మాటల తూటాల నుండి ముష్టి ఘాతాలు చోటుచేసుకున్నాయి. సభ్యులు ఒకరిపై మరొకరు ఆదిపత్యం చెలాయించుకొనేందుకే ఇలాంటి ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.
చిన్న సంఘటన.. పెద్ద గొడవ.. విజ్ఞత మరిచిన సభ్యులు..
మండలిలో ఏ అంశాన్ని ముందుగా చర్చించాలన్న దానిపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్న సమయంలో ఊహించని ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. ఉత్కంఠ భరితంగా మారిన రెండు బిల్లుల పట్ల మండలిలో వాగ్వివాదాలు చెలరేగాయి. రూల్ 90పై ఓటింగ్ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేశారు. వీరికి మాజీ మంత్రి లోకేశ్ తోడ్పాటు అందించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తుతున్న తరుణంలో మంత్రులతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో లోకేశ్ రెండు చేతులు పైకెత్తి పోడియం వైపు చూపిస్తూ తమ వాదన వినిపించారు.
పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫైటింగ్ ను మరిపించిన వెల్లంపల్లి.. రెచ్చిపోయిన బీద రవిచంద్ర..
సరిగ్గా ఇదే సమయంలో నారా లోకేష్ చేతుల్లో సెల్ ఫోన్ కనిపించింది. ఫోటోలు తీస్తున్నట్లుగా భావించిన అధికార పార్టీ సభ్యులు లోకేష్ ను నివారించే ప్రయత్నం చేసారు. అందుకు తగ్గట్టుగానే మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కల్పించుకుని లోకేశ్ ను చట్ట సభల్లో ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్దమని మైకులో చెప్పారు. పోడియం చుట్టుముట్టిన తమను లోకేశ్ ఫోటోలు తీస్తున్నారని భావించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. లోకేశ్ పైకి దూసుకొచ్చారు. అసలు ఫైటింగ్ సన్నివేశం ఇక్కడే చోటుచేసుకుంది. లోకేశ్ పై దాడికి మంత్రి వెల్లంపల్లి ప్రయత్నిస్తున్నారని భావించిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనూహ్యంగా అడ్డుకున్నారు. ఇదే పరంపరలో అనుకోని రీతిలో బల్ల తగిలి మంత్రి వెల్లంపల్లి కింద పడిపోయారు. తనను కిందికి తోయటంతోనే తాను పడినట్లుగా భావించిన మంత్రి వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సభ్యుల బూతులు వినలేకపోయాం.. సిగ్గుతో తలవంచుకున్న మహిళ సభ్యులు..
దీంతో పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎగిరెగిరి తన్నినట్టు బీద రవిచంద్రను ఎగిరి తన్నారు వెల్లంపల్లి. దీంతో బీద రవిచంద్ర సైతం మంత్రిని తన్నారు. దీంతో మండలిలో పరిస్థితి ఒక్కసారిగా బాహుబలి సినిమాలో కాలకేయ ఫైటింగ్ సన్నివేశాన్ని మరిపించింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వేగంగా స్పందించి మంత్రి వెల్లంపల్లిని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, టీడీపీకి చెందిన దీపక్ రెడ్డి తదితరులు బీద రవిచంద్రను వెనక్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన సభ్యులు కుళాయి దగ్గర నీళ్ల కోసం తిట్టుకున్నన్న ఆడాళ్ల లాగా ఘాటుగా తిట్టుకున్నారు. సభతో ఉన్న మహిళా సభ్యురాళ్లు జీవితంలో వినని బూతులు సభ్యుల ద్వారా వినాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చట్టాలు చేయాల్సిన సభ్యులు చట్టాలను గౌరవించకపోగా వీధి రౌఢీల్లా వ్యవహరించడం సిగ్గుచేటనే చర్చ జరుగుతోంది.