అన్ని కోట్లా?: తెలుగు రాష్ట్రాల్లో నంద్యాలే ఖరీదైన ఎన్నిక.. ఒక్కో ఓటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నిక అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల: ఎన్నికలంటేనే ప్రలోభాల పర్వంగా మారిపోయిన పరిస్థితి. ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి మద్యాన్ని ఏరుల్లా పారించడానికైనా.. జేబుల్లో నోట్ల కట్టలు కుక్కడానికైనా పార్టీలు వెనకాడవు. అలాంటిది.. తప్పక గెలవాలని కంకణం కట్టుకున్నాక.. ఆ పరిస్థితి తీవ్రత మరింత ఎక్కువగానే ఉంటుంది.
నంద్యాల ఉపఎన్నికలోను ఇదే విషయం స్పష్టమవుతోంది. అంతర్గతంగా ధన ప్రవాహం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పట్టుబడింది రూ.40లక్షలు కాగా, 'అనధికారికంగా రూ.60కోట్ల దాకా' పార్టీలు ప్రజలకు పంపిణీ చేశాయన్న ప్రచారం జరుగుతోంది.
ఒక్కో ఓటుకు రూ.1వెయ్యి నుంచి రూ.5వేల దాకా ఓటర్లకు చేరినట్లు తెలుస్తోంది. ప్రచార పర్వం ముగిసిన వెంటనే ప్రధాన పార్టీలు రెండు ఈ వ్యవహారంలో తలమునకలయ్యాయన్న వాదన వినిపిస్తోంది. తొలుత ఒక పార్టీ వారు రూ.వెయ్యి పంపిణీ చేయగా.. ప్రత్యర్థి పార్టీ మరో వెయ్యి పెంచడంతో.. తిరిగి ఆ పార్టీ మరో రూ.వెయ్యిని వారికి అందజేసినట్లు చెబుతున్నారు.
రెండు పార్టీలు పోటాపోటీగా పంపిణీ చేపట్టగా.. చివరకు ఒక పార్టీ మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసినట్లు స్థానికులు చర్చిస్తుండటం గమనార్హం. అదే సమయంలో తమకు డబ్బు అందలేదని కొంతమంది ఓటర్లు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారట.
నంద్యాలలోని కొన్నివార్డుల్లో మహిళలు ఇదే ఆరోపణలు చేయడంతో.. డబ్బులు జేబులో వేసుకున్న స్థానిక నాయకులు తిరిగి వాటిని పంపిణీ చేసినట్లు సమాచారం.
నగదు పంపిణీ కోసం పార్టీలు బయటి వ్యక్తులను నియమించుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ స్థానిక కార్యకర్తలు ఓటర్ల ఇళ్ల వద్దకు వారిని తీసుకెళ్తుండగా.. ఇంట్లో వారి లెక్కనుబట్టి సదరు వ్యక్తులు ఎంతో కొంత ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా నంద్యాల ఉపఎన్నికలో డబ్బు ప్రవాహాం యథేచ్చగా సాగిపోతుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నిక అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.