మరో కలకలం: నురగలతో చనిపోతున్న కాకులు, ఏం జరుగుతోందోనని జనం ఆందోళన
తూర్పుగోదావరి: ఇప్పటికే ప్రపంచమంతా కరోనావైరస్ కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతుంటే.. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పి. గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగుగుంటలో రెండ్రోజులుగా కాకులు చనిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నరు.
Recommended Video
నురగలు కక్కుకుని..
కాకులు నురగలు కక్కుని చనిపోతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం పశుసంవర్థక శాఖ డీడీ ఏసురత్నం చనిపోయిన కాకులకు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేగాక, కాకులను కాకినాడలోని డీఎల్డీఏ ల్యాబ్కు పంపించి పరీక్షలు చేస్తామని తెలిపారు.
కుక్కలు కూడా..
ఇది ఇలావుండగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కలు చనిపోతుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడులోని పనపాక్కంలో కుక్కల మరణాలు ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో ఆహారం లభించక కుక్కలు చనిపోతున్నాయా? లేక ఏదైనా వైరస్ సోకిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన కుక్కలను పాతిపెట్టిన సంబంధిత అధికారులు.. కుక్కల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు.
ఏపీలో పాజిటివ్ కేసులు..
కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం వరకు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో 365కు పెరిగింది. మరో 10 మందికి కరోనా నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మినహా ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్కు వెళ్లివచ్చినవారే ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా 6412 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 150కిపైగా మరణాలు సంభవించాయి.