లేఖ ఎఫెక్ట్: ఏపీ ఎస్ఈసీకి కేంద్ర, రాష్ట్ర పోలీసులో భద్రత
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. విజయవాడలోని బందరు రోడ్డు ఉన్న ఎస్ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రతగా ఉన్నారు.
గన్నవరంలోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ కు చెందిన ఒక ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుళ్లతో భద్రత కల్పించారు. కాగా, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ, తనకు భద్రత కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరిన విషయం తెలిసిందే.
ఆ లేఖపై అధికార వైస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు, తన కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదని, కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలని ఎస్ఈసీ లేఖలో కోరారు. ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చానని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏనాడూ చూడని విధంగా 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయని, సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ విధించడం వల్లే ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిందని నిమ్మగడ్డ రమేశ్ ఆరోపించారు. ''2014లో కేవలం 24 శాతం ఎంపీటీసీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా 126 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం సొంత జిల్లా కడపలోనైతే 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. బెదిరింపులు బలంగా పనిచేశాయనడానికి ఇవే ఉదాహరణలు'' అని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో హింసాయుత పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా లేదని, ఎన్నికలు ప్రశాంతంగా, పక్షపాతం లేకుండా జరగాలంటే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాలని, ప్రధానంగా కేంద్ర హోం శాఖ తక్షణమే బలగాలను ఏపీకి పంపాలని రిక్వెస్ట్ చేశారు.
Recommended Video
ప్రస్తుతం ఏపీలో పనిచేస్తోన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు విధులు నిర్వర్తించే పరిస్థితుల్లో లేరని, కాబట్టి, సెక్యూరిటీ వ్యవహారాలతోపాటు ఎన్నికల నిర్వహణను కూడా కేంద్రమే చేపట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తుండటం గమనార్హం.