చమురు మాఫియానా?...మజాకా?..ఏకంగా ఓఎన్జీసీ పైప్ లైన్ కే కన్నం:రోజుకు రూ.లక్ష విలువైన చమురు చౌర్యం
తూర్పుగోదావరి:తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవలి కాలం వరకూ ట్యాంకర్లలోని చమురునే దోచుకునే చమురు మాఫియా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఏకంగా ఓఎన్ జిసి చమురు సరఫరా పైప్ లైన్లకే కన్నం వేసి యాధేచ్చగా చమురు దొంగిలిస్తోంది.
ఇలా వీరు రోజుకు చౌర్యం చేసే సరుకు కనీసం విలువెంతో తెలుసా?...కనీసం లక్ష రూపాయలు...ఆశ్చర్యంగా ఉందా?...మీకేంటి?...వీరి చేతివాటం చూసిన అధికారులకే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఓఎన్జీసీ కాకినాడ ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్ పరిధిలో జరుగుతున్న ఈ చమురు దోపిడీ టాక్ ఆఫ్ ద టౌనే కాదు...డిబేట్ ఆఫ్ ద స్టేట్ కూడా అయింది. మరందుకే...చమురు మాఫియానా?...మజాకా?...అంటోంది. ఇక వివరాల్లోకి వెళదాం!...
చమురు చౌర్యం...ఎట్టకేలకు గుర్తించారు
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలో ఓడలరేవు గ్రామం నుంచి ఓఎన్జీసీ ముడిచమురు ఆన్షోర్ టెర్మినల్ ద్వారా ఎస్.యానాం ప్లాంటుకు వెళుతుంది. భూగర్భ పైపులైన్ ద్వారా ఈ ముడిచమురు అక్కడకు సరఫరా అవుతోంది. అయితే ఈ చమురు పైపులైన్ నుంచి కొంత కాలంగా చమురు చోరీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చమురు పంపిణీ లెక్కల్లో తేడా రావడంతో ఎక్కడో చమురు చౌర్యం జరుగుతోందని అధికారులకు అర్థమయింది. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అలా నెలల తరబడి చౌర్యం జరుగుతూనే ఉంది. అయితే రోజుకు సుమారు 35 బ్యారెళ్ల చమురు చౌర్యానికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
క్షుణ్ణంగా పరిశీలించి...పట్టుకున్నారు...
ఇలా లాభం లేదని భావించిన ఓఎన్జీసీ అధికారులు మరింత లోతుగా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓఎన్జీసీ సీనియర్ సెక్యూరిటీ అధికారి బి.రమేష్కుమార్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది ఓడలరేవు నుంచి ముడిచమురు సరఫరా అవుతున్న గొట్టం వెంబడి తనిఖీలు నిర్వహించారు. ఓడలరేవు ఆన్షోర్కు రెండు కిలోమీటర్ల దూరంలోని జీడిమామిడి తోటల్లో చమురు ఆనవాళ్లు కనిపించాయి. అనుమానమొచ్చి నిశితంగా పరిశీలించిన తనిఖీ బృందాలకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి నివ్వెరపోయారు.
చమురు మాఫియానా?...మజాకా?
అక్కడ ఉన్న ఓ తోటలో రెండు వేల లీటర్లకు పైగా సామార్ధ్యం కలిగిన సింటెక్స్ ట్యాంకు ఒకటి భూమిలో పాతిపెట్టి ఉండడం, దానిపైన తాటాకులు కప్పి ఉంచడాన్ని అధికారులు గమనించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు నిశితంగా పరిశీలిస్తే అక్కడ చమురు పైపులైన్కు రంధ్రం చేయబడి...దానికి సుమారు ఒకటిన్నర అంగుళాల వెడల్పు గొట్టాన్ని అమర్చి కాంక్రీటు పోత పోసివుండటం గమనించారు. అక్కడ నుంచి ఆ గొట్టాన్ని భూమార్గం ద్వారా సమీపంలోని మరో తోట వరకు తీసుకెళ్లి అక్కడ భారీ సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేసి ముడి చమురును అందులో నిల్వ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ చమురును రాత్రివేళల్లో ట్యాంకర్ల ద్వారా బైటకు తరలించి యధేచ్చగా అమ్ముకుంటున్నారు.
ఇంటి దొంగల హస్తంపై...అనుమానాలు
అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ తంతు చాలాకాలంగా జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నెలకు కనీసం రూ. 30 లక్షల చొప్పున ఎన్ని నెలలుగా చమురు చౌర్యం జరుగుతుంటే ఓఎన్జీసికి అంత నష్టం. ఇక ప్రధాన చమురు గొట్టాన్ని రధ్రం చేసి వేరే గొట్టానికి అనుసంధానం చేసిన స్థలం జగ్గన్నపేటకు చెందిన లక్కింశెట్టి బాబ్జికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ట్యాంకులోకి చమురు డంప్ అవుతున్న స్థలం ఉండ్రు రమాబాయికు చెందినదిగా తెలిసింది. అయితే వారిద్దరూ వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల చమురు దొంగలు ఈ స్థలాల్ని ఎంచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా చమురు దొంగిలించడం చాలా ప్రమాదకరమని, అనుకోని రీతిలో ఏదేని అగ్నిప్రమాదం జరిగినా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఓడలరేవులోని ఓఎన్జీసీ ప్లాంటుకు అర కిలోమీటరు దూరంలో తోటల మధ్య ఈ చోరీ జరుగుతూండటం వెనుక ఓఎన్జీసీ ఇంటి దొంగల హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.