సీఎస్ వర్సెస్ సీఎం ముఖ్యకార్యదర్శి: నోటీసులో కీలక అంశాలు: బేఖాతర్ ఫలితం..!
ఏపీ ప్రభుత్వంలో ఒక అధికారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..సంజాయిషీ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శి...అదే విధంగా జీఏడీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ కు నోటీసు జారీ చేసారు. ఇప్పుడు సీఎస్ జారీ చేసిన ఈ షోకాస్ నోటీసులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ షోకాజ్ నోటీసు ఇవ్వటానికి కారణాలను సీఎస్ అందులోనే స్పష్టంగా వివరించారు. కేబినెట్ ఎజెండా తయారీలో, మంత్రివర్గ సమావేశంలో చర్చకు రావాల్సిన అంశాలను పొందుపరచడంలో ప్రవీణ్ బిజినెస్ రూల్స్ పాటించలేదని, వీటికి సంబంధించి సీనియర్ అధికారులు ఇచ్చిన ఆదేశాలనూ ఖాతరుచేయలేదని పేర్కొన్నారు. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
సీనియర్ అధికారి ఇలా..
ప్రవీణ్ ప్రకాశ్ సీనియర్ అధికారి. చంద్రబాబు హయాంలో ఆయన ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఇదే హోదాలో ఉన్న టీటీడీ ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో ప్రవీణ్ ప్రకాశ్ ను నియమించారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎం తన కార్యాయలంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. అదే విధంగా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు..ఆదేశాల అమలు విషయంలో బిజెనెస్ రూల్స్ మారుస్తూ..వాటి అమలుకు నిర్ణీత గడువు విధింపు విషయంలో ఆయన ప్రొసీజర్ ప్రకారం వెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రం మొత్తానికి పరిపాలనాధికారి. సీఎంఓ అదేశాలు ఉన్నా..సీఎస్ కు వివరించిన తరువాత ఉత్తర్వులు జారీ చేస్తే సమస్య తలెత్తేది కాదు. కానీ, సీఎస్ ను పక్కన పెట్టి ప్రవీణ్ ప్రకాశ్ నేరుగా ఉత్తర్వులు జారీ చేయటంతో సమస్య మొదలైంది. ఇది సరైనది కాదంటూ సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల అంశాల్లోనూ..మంత్రివర్గ సమావేశాలకు అందించాల్సిన ఫైళ్ల విషయంలోనూ అభ్యంతరాలు ఉన్నాయి.
షోకాజ్ నోటీసులో కీలక అంశాలు..
ఇక, ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసు జారీ చేయటం ప్రభుత్వ వర్గాల్లో కలకలానికి కారణమైంది. ఆ నోటీసులో ప్రవీణ్ ప్రకాశ్ ఏ విధంగా నిబంధనలను ఉల్లఘించారో సీఎస్ వివరించారు. వైఎస్ఆర్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుల ఫైలును కేబినెట్ అజెండాలో పొందుపరిచేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రవీణ్ ఫైలు పంపారు. అయితే, ఆ ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని తిరిగి పంపాలని ఆదేశిస్తూ సీఎస్ వెనక్కి పంపారు. కానీ, అవేమీ పాటించకుండా ఆ ఫైలును ప్రవీణ్ ప్రకాశ్ నేరుగా కేబినెట్ ముందు ప్రవేశపెట్టాడు. బిజినెస్ రూల్స్లోని రూల్ 7(2) ప్రకారం.. సెక్రటరీ ఒక ఫైలుపై సంబంధిత శాఖ నుంచి తప్పనిసరిగా ఆమోదాలు తీసుకోవాలి. వైఎస్సార్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుల ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. పైగా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన సూచనలు ఇచ్చినా... ఆ ఆదేశాలను పట్టించుకోకుండా నేరుగా ఆ ఫైలును కేబినెట్ ముందు ప్రవేశ పెట్టారు. మంత్రివర్గ సమావేశంలో గ్రామన్యాయాలయాల ఫైలు పెట్టాలని న్యాయశాఖకు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆదేశాలు అందాయి. ఆ ఫైలుపై సీఎం సంతకం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన మెమోను జీఏడీలోని కేబినెట్ విభాగానికి అందజేశారు. అయినప్పటికీ గత నెల 16వ తేదీ, 30వ తేదీ ల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో గ్రామ న్యాయాలయాల ప్రతిపాదన ఫైలును ప్రవేశపెట్టడంలో ప్రవీణ్ ప్రకాశ్ విఫలమయ్యారని పేర్కొన్నారు.
వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి..
ఇక, ఇదే షోకాజ్ నోటీసులో ప్రతిపాదనలను నిలుపుదల చేసే అధికారం ఆయనకు లేదని.. ఈ ఫైలును కేబినెట్లో పెట్టకూడదని ఒకవేళ సీఎం కార్యాలయం నుంచి ప్రవీణ్ ప్రకాశ్కు మౌఖిక ఆదేశాలేమైనా అందిఉంటే.. ఆ విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకురావాల్సి ఉన్నా.. అలా జరగలేదని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, ఫైళ్ల సర్క్యులేషన్లో ప్రవీణ్ ప్రకాశ్ నిబంధనలు పాటించలేదని, ఉద్దేశపూర్వకంగా పై అధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారని.. తద్వారా ఏఐఎస్ కండక్ట్ రూల్స్ 1968ను ఉల్లంఘించారని సీఎస్ జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. వీటన్నిటికీ వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో..ఇప్పుడు దీని పైన ప్రభుత్వ వర్గాల్లో..సీనియర్ అధికారుల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది. దీనికి ప్రవీణ్ ప్రకాశ్ ఏ విధంగా సమాధానం ఇస్తారు.. లేక, ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుందా అనే చర్చ సైతం సాగుతోంది. అయితే, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలోని వారు జోక్యం చేసుకొని ఈ వ్యవహారానికి ముగింపు పలికే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.