విభజన ప్రక్రియ ఎంత వరకు?: సిఎస్ మహంతి సమీక్ష
రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ నెరవేరుస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి మండళ్ల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు చేస్తున్నామని, సీమాంధ్రలో పన్నుల మినహాయింపునకు సంబంధించి ఇప్పటికే 13వ ఆర్థికసంఘం సిఫారసు మేరకు దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిందని, రెండు రాష్ట్రాల్లోని విద్యార్థుల ఉన్నత విద్య కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర మానవ వనరుల శాఖ పూర్తి చేసిందని మహంతికి అజిత్ చెప్పారని తెలుస్తోంది.
ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీని నియమించామని, సీమాంధ్రలోని 13 జిల్లాలనూ ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి గ్రాంట్లు ఇచ్చే బాధ్యతను జాతీయ అభివృద్ధి మండలి చేపట్టనుందని, కేంద్రస్థాయిలో తీసుకోవాల్సిన అంశాలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్పారు.
అజిత్ సేథ్ ఆరా నేపథ్యంలో మహంతి గురువారం వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి మూడు గంటల సేపు సమీక్షించారు. విభజన ప్రక్రియ వేగవంతం చేయాలని, నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెలలో మిగిలింది 19 పని దినాలు మాత్రమే కాబట్టి ఈ ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు.