సంచలనం:నగల స్వాహా ఘటనలో డిసిసి బ్యాంకు అధికారుల సస్పెన్షన్,పోలీస్ కేస్
కడప:కంచే చేను మేసిన చందంగా డిసిసి బ్యాంకులో కుదవపెట్టిన నగలను అడ్రస్ గల్లంతు చేసిన సిద్దవటం కేంద్ర సహకార బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. నగలు స్వాహా కు కారణంగా భావిస్తున్న వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.అంతటితో సరిపెట్టకుండా వారివురుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా సిద్దవటంలోని డిసిసి బ్యాంకులో 2017 జులై నెలలో అట్లూరు, సిద్దవటం మండలాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు 377.5 గ్రాముల బంగారు నగలు కుదవ పెట్టి రూ.5.63 లక్షల నగదును రుణంగా పొందారు. ఈ ముగ్గురికీ చెందిన నాలుగు నగల సంచులను అప్పట్లో అధికారులు బ్యాంకు లాకరులో ఉంచారు. అయితే ఈనెల 17వ తేదీన ప్రస్తుత బ్యాంకు మేనేజరు రవిచంద్రరాజు లాకరులోని నగల సంచులను లెక్కించగా ఆ నాలుగు సంచులు కన్పించలేదు.
దీంతో ఖంగుతిన్న ఆయన బ్యాంకు ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలిపారు. దీంతో శుక్రవారం కడప కేంద్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజరు కె.వెంకటేశ్వర్లు, సహాయ జనరల్ మేనేజరు కె.కోసలరామ్, బాధ్య జనరల్ మేనేజరు సురేంద్రరాజ్ సిద్దవటం బ్యాంకుకు వచ్చి విచారణ జరిపారు. ఆ తరువాత మరోసారి బ్యాంకు లాకరులో ఉన్న నగల సంచులను పరిశీలించి లెక్కించారు. దీంతో బ్యాంకులో కుదువపెట్టిన నాలుగు బంగారు నగల సంచులు కనిపించని విషయం నిర్థారణ అయింది.
అనంతరం జనరల్ మేనేజరు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకులో కుదవ పెట్టిన నాలుగు నగల సంచులు కన్పించని విషయం వాస్తవమేనన్నారు. 377.5 గ్రాములు ఉన్న ఈ నగలు సుమారు రూ.13 లక్షల విలువ చేస్తాయన్నారు. నగల సంచులు కన్పించకపోవడానికి ప్రస్తుత మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆయనను, గతంలో ఈ బ్యాంకులో పనిచేసి బదిలీ మీద రాజంపేట బ్యాంకుకు వెళ్లిన అసిస్టెంట్ మేనేజరును కూడా సస్పెండ్ చేశామని వెల్లడించారు. నగల విషయంలో చార్జి ఇవ్వకుండా రిలీవ్ అయినందుకే అసిస్టెంట్ మేనేజరుపై వేటు వేయడం జరిగిందన్నారు.
వీరిద్దరిపై పోలీసు స్టేషన్లో కేసు పెడుతున్నామన్నారు. పోలీసులు విచారణలో పోయిన నగలు తప్పకుండా లభ్యమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే నగలు కన్పించకపోవడానికి బ్యాంకులో దొంగతనం లాంటిదేదీ జరగలేదని, అందువల్ల ఇది బ్యాంకులో పనిచేసిన ఉద్యోగుల పనేనని ఆయన స్పష్టం చేశారు. బాధిత ఖాతాదారులు వచ్చి వారి నగలు కావాలని అడిగితే ప్రస్తుత విలువ ప్రకారం వాటిని లెక్కగట్టి అంత మొత్తంలో వారికి నగదు చెల్లిస్తామని ఆయన తెలిపారు.