జీఎస్టీ ఎఫెక్ట్: బిగ్ బజార్పై కస్టమర్ల దాడి.. ఆఫర్ పేరుతో ఉసూరుమనిపించారు!
సేల్స్ సంగతి అటుంచి.. పరిస్థితులు అదుపు తప్పేలా కనిపించడంతో.. ముందు జాగ్రత్తగా మాల్ ను మూసేశారు.
విశాఖపట్నం: జీఎస్టీ ఎఫెక్ట్తో క్లియరెన్స్ సేల్ ఆఫర్ల మోత మోగించిన మాల్స్ కస్టమర్లను బాగానే క్యాష్ చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గురు,శుక్రవారాల్లో ఎక్కడ చూసినా మాల్స్ అన్ని కిటకిటలాడుతూ కనిపించాయి. క్యాష్ కౌంటర్ల వద్ద బారులు తీరి మరీ జనం కనిపించారు. దీంతో మాల్స్ లో అమ్మకాల రేటు అమాంతంగా పెరిగిపోయింది.
విశాఖపట్నంలోని బిగ్ బజార్ కూడా క్లియరెన్స్ సేల్ ఆఫర్ ప్రకటించగా.. జనం తాకిడి ఎక్కువవడంతో సీన్ అంతా రచ్చ రచ్చయిపోయింది. విశాఖ నలుమూలల నుంచి వచ్చిన జనాన్ని అదుపు చేయలేక బిగ్ బజార్ యాజమాన్యం చేతులెత్తేసింది. సేల్స్ సంగతి అటుంచి.. పరిస్థితులు అదుపు తప్పేలా కనిపించడంతో.. ముందు జాగ్రత్తగా మాల్ ను మూసేశారు.
ఈ సందర్భంగా మాల్ ఎదుట జనం తాకిడి ఎక్కువై పలువురు మహిళల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, ఆఫర్ అంటూ ప్రకటించి.. తీరా అక్కడికెళ్లాక మాల్ క్లోజ్ చేసేయడంతో బిగ్ బజార్ పై కస్టమర్లు విరుచుకుపడ్డారు. ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బయట ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తతలు కూడా ఏర్పడ్డాయి.