ప్రయాణికుడి నుంచి బంగారం, రంగురాళ్లు సీజ్
హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సయ్యద్ జాఫర్ అనే ప్రయాణికుడి నుంచి కిలో బంగారంతో పాటు విలువైన పసుపుపచ్చ రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి శుక్రవారం తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయంలో సయ్యద్ జాఫర్ దిగాడు.
విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అతని వద్ద కిలో బంగారంతో పాటు విలువైన రంగురాళ్లు ఉన్నట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. ఆ తర్వాత అతడ్ని విమానాశ్రయం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సయ్యద్ జాఫర్ తన లోదుస్తుల్లో బంగారాన్ని, రంగురాళ్లను దాచుకున్నట్లు తెలుస్తోంది.
శంషాబాద్ విమానాశ్రయంలో వరుసగా మూడు రోజుల నుంచి మూడు వేర్వేరు సంఘటనల్లో నాలుగున్నర కిలోల బంగారంతో పాటు రంగురాళ్లను పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత పది నెలల నుంచి కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో పది సార్లు దాదాపు 28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం అరకిలో బంగారాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన తల్లీ కూతుళ్లు హైమవతి, లక్ష్మి మలేషియా నుంచి ఎమిరేట్ 198 విమానంలో గురువారం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు అక్రమంగా బంగారాన్ని తీసుకుని వచ్చినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారాలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.