కరోనా ఎఫెక్ట్ : బయటపడిన ప్రభుత్వాల డొల్లతనం- 10 రోజుల లాక్ డౌన్ కే వేతనాల్లో కోతలు, వాయిదాలు
ఏపీ విభజన తర్వాత ఆర్ధికంగా నష్టపోయిన తెలుగురాష్టాలు లక్షల కోట్లు అప్పులు చేశాయి. వీటిని తీర్చేందుకు కొన్నేళ్లుగా నానా కష్టాలు పడుతున్నాయి. అయితే ఇన్నాళ్లూ ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణతో పాటు రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఉన్న ఏపీ కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా చిరుగుటాకులా వణికిపోతున్నాయి. ప్రభుత్వాలు పనిచేయడంలో కీలకమైన ఉద్యోగుల జీతభత్యాలను కూడా చెల్లించలేక ఒకరు కోత విధిస్తే మరొకరు వాయిదా వేసేశారు. కేవలం పది రోజుల లాక్ డౌన్ కే రెండు రాష్ట్ర్రాలకు ఈ పరిస్ధితి ఎందుకొచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
విభజన తర్వాత భారీగా అప్పులు..
2014లో ఏపీ విభజన సమయంలో లక్ష కోట్లు కూడా లేని రాష్ట్ర అప్పును ఇరు తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత లక్షల కోట్లు దాటించేశాయి. రాష్ట్ర అభివృద్ధి పేరుతో ప్రపంచబ్యాంక్ తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్ధల నుంచి రుణాలను పొందాయి. అయితే వీటిని మూలధన పెట్టుబడిగా ఖర్చు చేశాయా అంటే లేదనే చెప్పాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టుల కోసం ఖర్చుపెట్టిన మొత్తం కంటే అనవసర ఆర్భాటాలకు పోయి వృథా చేసిన మొత్తమే ఎక్కువ.
కొండలా పెరిగిన వడ్డీలు..
ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లు.. రుణాలు లక్షల కోట్లు దాటిపోతుంటే వడ్డీలు మాత్రం వందల కోట్లు ఉంటాయా... అవి కూడా వేల కోట్లు దాటిపోయాయి. ప్రతీ నెలా వేల కోట్ల మొత్తం రుణాలపై వడ్డీలకే చెల్లించాల్సిన పరిస్దితి ఇరు తెలుగు రాష్ట్రాలది. వీటిని ఠంచనుగా చెల్లిస్తేనే మళ్లీ కొత్త రుణాలు పుట్టేది. ఎక్కడ తేడా వచ్చినా రుణ పరపతి తగ్గిపోతుంది. దీంతో కొత్తగా రూపాయి కూడా పుట్టదు. దీంతో సహజంగానే సొంత ఖర్చులు వాయిదా వేసుకుని అయినా జాతీయ, అంతర్జాతీయ స్దాయి సంస్ధలకు రుణాలపై వడ్డీలు తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్ధితి.
భారంగా జీతాలు, పింఛన్లు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్లలో రుణాల వడ్డీ చెల్లింపుతో పాటు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర చెల్లింపులే ఉన్నాయి. వీటికే బడ్జెట్లలో దాదాపు 70 శాతం పైగా ఖర్చవుతోంది. దీంతో రుణాల వడ్డీ చెల్లింపు తప్పనిసరి కాబట్టి ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో కోత విధించక తప్పని పరిస్ధితి. అయితే ఏపీలో కాస్త నయం. ప్రస్తుతానికి ఓ విడత చెల్లిస్తాం, మరో విడత డబ్బులు చూసుకుని తర్వాత చెల్లిస్తామంటూ జగన్ ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చే మాట చెప్పారు.
10 రోజులకే చిగరుటాకుల్లా వణుకు..
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించింది మార్చి 22. ఆ తర్వాత నెలాఖరు వరకూ లాక్ డౌన్ విధించినా మరో 10 రోజులు మాత్రమే. ఈ పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల ఆదాయాలన్నీ గండిపడిపోయి ఆర్ధిక సంక్షోభం తలెత్తిందా అంటే అవునని కచ్చితంగా సమధానం చెప్పలేని పరిస్ధితి ప్రభుత్వాలది. ఇదంతా చూస్తుంటే ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్ధికంగా ఇంత బలహీనంగా ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పది రోజులకే ఇలా ఉంటే మరో రెండు వారాలు దేశంలో లాక్ డౌన్ తప్పనిసరిగా ఉంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ ఎత్తేస్తారా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. కాబట్టి రాబోయేది మరింత గడ్డుకాలమే అనేది చెప్పక తప్పదు.