చంద్రబాబు ఎఫెక్ట్, అందుకే ఈ రోజు పెట్రోల్ ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ!
అమరావతి/కోల్కతా: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించడంపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2.50 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై వర్ల స్పందించారు. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే కేంద్రం తగ్గించిందన్నారు.
చదవండి: అందుకే టీడీపీతో పొత్తు, కేసీఆర్! టీడీపీపై అప్పుడు గుర్తుకు లేదా: రేవంత్ రెడ్డి
చంద్రబాబు ఇటీవల పెట్రోల్ ధరలు తగ్గించటం వల్లే కేంద్రం పైన తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. దీంతో ఈ రోజు పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మండిపోతున్న పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు బంద్ చేసినప్పుడే ఈ ధరలు తగ్గించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పెట్రోల్ ధరలు మరింత తగ్గించొచ్చు
పెట్రోల్ ధరలపై కనీసం పది రూపాయలు తగ్గించేందుకు కేంద్రానికి అవకాశముందని వర్ల రామయ్య చెప్పారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి భాష మాట్లాడటం సరికాదని చెప్పారు. కేసీఆర్ సరిగా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.
రూ.10 తగ్గించాలి
పెట్రోల్ ధర తగ్గింపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ ధరలను రూ.10 చొప్పున తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలపై రూ.10 చొప్పున తగ్గించాలని, ఈ ప్రభుత్వం దేశ ప్రజల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పార్టీ ప్రయోజనాల పైనే కేంద్రమంత్రులు
బీజేపీ ప్రయోజనాల పైనే కేంద్ర మంత్రులు దృష్టి సారించారని మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ధరల తగ్గింపుపై స్పందించింది. 1000 గాయాలు చేసిన తర్వాత కేంద్రం ఒక్క బ్యాండేజ్ వేసే ప్రయత్నం చేస్తోందని, 2014లో పెట్రో ధరలు ఉన్నరేటుకి ఇప్పుడు అందించగలరా అని రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని మమతా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.1 తగ్గించారు.
కాగా, ఇప్పుడు మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.50 తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీ గురువారం ప్రకటించారు. కేంద్రం పెట్రో ధరలు తగ్గించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పందిస్తూ... ప్రజల సంక్షేమంపై కేంద్రం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు.