ప్రసాదంలో విషం...! గుప్త నిధులంటూ పది హత్యలు
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి ప్రసాదంలో సైనెడ్ కలిపి హతమార్చిన సంఘటన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. రియల్ ఎస్టెట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో దాన్ని పూడ్చుకునేందుకు మోసాలకు తెరతీసిన దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.. రంగురాళ్లు, గుప్తనిధులు, మరియు రెట్టింపు బంగారం అంటూ మోసం చేస్తూ ...చివరకు కటకటాలపాలయ్యాడు. డబ్బుల కోసం ఏకంగా ప్రసాదంలో విషం కలిపి పదిమందిని బలితీసుకున్నాడు.
ఘరాన హంతకున్ని పట్టుకున్న పోలీసులు
గత నెల జరిగిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన పీఈటీ నాగరాజు హత్యకేసును పోలీసులు చేదించారు. అయితే కేసులో పలు దిగ్భ్రాంతి కల్గించే విషయాలను పోలీసులు కనుకొన్నారు. నాగరాజుతో పాటు మరో పశ్చిమ, తూర్పు గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో పదిమందిని ప్రసాదంలో సైనెడ్ కలిపి హతమర్చినట్టు పోలీసులు వెల్లడించారు. బంగారం, డబ్బుపేరుతో మోసాలు చేస్తూ పదిమందికి విషం ఇచ్చి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.
వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య వెలుగులోకి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అశోక్నగర్కు చెందిన కాటి నాగరాజు అనే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు గత నెల 16న రెండులక్షల నగదు, నాలుగున్నర తులాల బంగారు అభరణాలతో సైకిలుపై ఇంట్లో నుండి బయలు దేరాడు. అభరణాలు ఎందుకని ఇంట్లో అడిగిన నేపథ్యంలోనే పని ఉందని చెప్పిన నాగరాజు వాటిని తీసుకుని వెళ్లాడు. అయితే అదే రోజు రాత్రీ వట్లూరు కాలేజీ సమీపంలో రోడ్డుపక్కన విగతాజీవిగా పడి ఉన్నాడు.
నాగరాజును గుర్తు పట్టిన కానిస్టేబుల్
దీంతో నాగరాజు తెలిసిన ఓ కానిస్టేబుల్ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనంతరం ఆయన్ను సమీపంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగరాజు మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. అయితే నాగరాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ముందు గుండెపోటుతో మృతి చెందాడని భావించిన వారు ఆయన వద్ద బంగారం తోపాటు నగదు లేకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2 సంవత్సరాల్లో 10 మందికి విషం
ఏలూరుకు మండలం వెంకటాపురం గ్రామపంచాయితీకి చెందిన ఎల్లంకి సిహాంద్రి అలియాస్ శివ గతంలో రియల్ వ్యాపారం చేశాడు. అయితే దాంట్లో నష్ఠాలు రావడంతో అక్రమ మార్గాలకు తెరలేపాడు. తనకు తెలిసిన వారివద్ద రంగురాళ్లు, గుప్తనిధులతోపాటు బంగారం రెట్టింపు ఇస్తానని పలువురిని తన మాయ మాటలతో ఇతరులను నమ్మించాడు. ఇందుకోసం ముందుగా కొంత డబ్బు లేదా బంగారం అవసరం ఉంటుందని నమ్మించాడు. బాధితులు డబ్బులు పట్టుకువచ్చిన తర్వాత వాటిని తీసుకుని, వారికి ప్రసాదంలో సైనెడ్ కలిపి హతమార్చి పరారయ్యోవాడు. ఇలా ఉభయ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లాల్లో గత సంవత్సరం నుండి పదిమంది పొట్టనబెట్టుకున్నాడు. ఇలా క్షుద్ర పూజలతో ఎవ్వరికి అనుమానం రాకుండా సుమారు రెండు సంవత్సరాలు కాలం వెల్లదీశాడు.