తెలంగాణలో పట్టుబడ్డ రెండు కోట్ల గుట్టు తేల్చిన పోలీసులు.. టీడీపీ నేతలపై కేసులు నమోదు!
హైదరాబాద్: ఊహించిందే చోటు చేసుకుంది. రెండు కోట్ల రూపాయల నల్లధనాన్ని ఏపీలోని రాజమండ్రికి తరలిస్తున్న కేసులో సైబరాబాద్ పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీ మోహన్ పై కేసు నమోదు చేశారు. భారత శిక్ష్యాస్మృతిలోని 171బీ, 171ఈ, సీ, ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తెలిపారు. మురళీమోహన్ తో పాటు రెండు కోట్ల రూపాయలను తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నిమ్మలూరి శ్రీహరి, పండరి, ధర్మరాజు, జగన్మోహన రావులపైనా కేసు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత
నేరాన్ని అంగీకరించారు..
సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని హైటెక్ సిటీ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా.. జయభేరి కన్ స్ట్రక్షన్స్ ఉద్యోగులు శ్రీహరి, పండరి రెండు కోట్ల రూపాయలను తరలిస్తూ దొరికిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మురళీ మోహన్ కు ఈ మొత్తాన్ని అందజేయడానికి రాజమండ్రికి వెళ్తున్నట్లు వెల్లడించారని సజ్జన్నార్ స్పష్టం చేశారు. రైలు ద్వారా రెండు కోట్ల రూపాయలను రాజమండ్రికి తరలించడానికి సిద్ధపడినట్లు వెల్లడైందని అన్నారు.
ఆ డబ్బు జయభేరి సంస్థదే..
రెండు కోట్ల రూపాయల మొత్తం జయభేరీ సంస్థకు చెందినవేనని నిర్ధారించినట్లు సజ్జన్నార్ తెలిపారు. జయభేరి కనస్ట్రక్షన్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు ధర్మరాజు, జగన్మోహన్ రావు తమకు ఈ మొత్తాన్ని నిందితులు శ్రీహరి, పండరిలకు ఇచ్చారని ఈ డబ్బులు ఇచ్చారని, రైలులో వారు రాజమండ్రికి తీసుకుని వెళ్లాల్సి ఉందని అన్నారు. ఈ నగదును రైలులో రాజమండ్రికి తీసుకెళ్లాలని ధర్మరాజు, జగన్మోహన్ రావు ఇచ్చిన ఆదేశాలతో శ్రీహరి, పండరిలు డబ్బుతో కూడిన బ్యాగులతో బయలు దేరినట్లు తేలిందని స్పష్టం చేశారు.
ఆరుమందిపై కేసు..
సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా రాజమండ్రికి వెళ్లి.. అక్కడ యలమంచిలి మురళీకృష్ణ అనే వ్యక్తికి ఈ బ్యాగును అందజేయాల్సి ఉందని తమ విచారణలో తేలినట్లు సజ్జన్నార్ తెలిపారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద మురళీకృష్ణ అనే వ్యక్తి నిందితుల కోసం ఎదురు చూస్తుంటారని, ఆయన చేతికి ఈ బ్యాగును అందజేయాలని ధర్మారాజు, జగన్మోహన్ రావులు తమకు సూచించినట్లు నిందితులు తెలిపారని అన్నారు. ఈ ఘటనలో డబ్బులతో కూడిన బ్యాగును తీసుకెళ్తున్న శ్రీహరి, పండరిలతో పాటు బ్యాగును ఇచ్చిన ధర్మరాజు, జగన్మోహన్ రావు, యలమంచిలి మురళీకృష్ణ, జయభేరి సంస్థ ఛైర్మన్ మురళీ మోహన్ లపై కేసు నమోదు చేశామని అన్నారు.