కోస్తాంధ్రకు భారీ తుఫాను గండం- వాయుగుండంగా అల్పపీడనం- రేపటి నుంచి కుండపోత....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. తాజాగా ఇది వాయుగుండంగా మారింది. దీని ప్రభావంవంతో రాగల 48 గంటల్లో ఏపీలో భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావంతో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రం కల్లా వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావం కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలపైనా ఉండే అవకాశముంది. తుపాను కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Recommended Video
తుపాను హెచ్చరికల నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. కోస్తా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తుపాను సోమవారం తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం తర్వాత తుపాను వాస్తవ పరిస్ధితి తెలిసే అవకాశముంది.