ఏపీకి తొలగని ఎంఫాన్ ముప్పు: మరింత బలోపేతం: 18 తరువాత భారీ వర్షాలు: నైరుతి రాకలో జాప్యం
విశాఖపట్నం: రాష్ట్రానికి ఎంఫాన్ (Amphan) తుఫాన్ ముప్పు పొంచే ఉంది. దాన్ని గండం ఇంకా తొలగలేదు. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడిందని, వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఇది తుఫాన్ రూపాంతరం చెందుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం వల్ల ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఎంఫాన్ తుఫాన్ అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణదిశ ఉపరితలంపై కిలోమీటర్ ఎత్తున ఆవరించి ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
వాయుగుండంగా
దీని ప్రభావం వల్ల అండమాన్లో 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖతో పాటు స్కైమెట్ వెదర్ వెబ్సైట్ కూడా ఇదే రకంగా అంచనా వేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచివుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో ఏర్పడిన మార్పుల ఫలితంగా అంచనా వేసినట్టుగానే అల్పపీడనం బలోపేతమైందని వాయుగుండంగా మారుతుందని చెప్పారు. మరో 48 గంటల వ్యవధిలో ఈ వాయుగుండం తుఫాన్గా రూపుదిద్దుకుంటుందనడంలో సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ఒడిశాలో 10 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
18 నుంచి భారీ వర్షాలకు ఛాన్స్
శనివారం సాయంత్రానికి తుఫాన్గా మార్పు చెందడానికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఎంఫాన్ క్రమంగా పెను తుఫాన్గా అవతరించడానికి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణం అనుకూలిస్తోందని అంచనా వేసిందా వెబ్సైట్. 18వ తేదీ తరువాత తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రస్తుతం స్థిరంగా ఉన్న ఈ వాయుగుండం తుఫాన్గా మారిన తరువాత దాని దిశను ఖచ్చితంగా అంచనా వేయడం వీలవుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ఎవరూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది.
నైరుతి రాకలో జాప్యం..
ఇదిలావుండగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో మరింత ఆలస్యం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోందని ఐఎండీ వెల్లడించింది. తుఫాన్ ప్రభావం వల్లే రుతు పవనాల రాకలో జాప్యం కలిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసినట్లు పేర్కొంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. ఈ సారి నాలుగు రోజులు ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. 5వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అభిప్రాయపడింది. ఈ గడువు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని వెల్లడిచింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది.
జిల్లా కలెక్టర్లు అప్రమత్తం..
ఈ మూ ఏర్పడిన ప్రతీసారీ ఒడిశా దాని బారిన పడుతుంటుంది. ఈ సారి ఎంఫాన్ ముంచుకొచ్చే పరిస్థితులు తలెత్తడంతో తీర ప్రాంత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.