తీరం దాటిన తుఫాను: చిగురుటాకులా వణికిన తీరప్రాంతం, పెనుగాలులు, మునిగిపోయిన రోడ్లు
Recommended Video
అమరావతి/విశాఖపట్నం/కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన విమానంలో రాజమండ్రి లేదా విశాఖపట్నం చేరుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అని అధికారులు పరిశీలించారు. అయితే ప్రతికూల వాతావరణం వల్ల నేరుగా అమరావతి చేరుకుంటారని తెలుస్తోంది. అమరావతిలో మంత్రులు, అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తారు.
ఆయన ఇటీవల గెలిచిన రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రాయపూర్ నుంచి నేరుగా అమరావతికి రానున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. చంద్రబాబు వచ్చాక.. మంత్రులు, అధికారులతో సమీక్ష అనంతరం ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడంపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పెథాయ్ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే చర్యలపై ఆయన మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు
పెథాయ్ తుఫాను కాకినాడ - యానాం మధ్య తీరం దాటింది. ఈ తుఫాను గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోట, ఉప్పలగుప్తం మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పెథాయ్ తుఫాను తీరం దాటిన తర్వాత మరో రెండు గంటల పాటు కాకినాడపై ప్రభావం ఉంటుందని చెప్పారు. విశాఖపట్నంలో పెద్ద పెద్ద చెట్లు నేల కూలాయి. రోడ్లను అంతా శుభ్రం చేస్తున్నారు.
కోనసీమ అంతటా భారీ వర్షాలు
తుఫాను ప్రభావంతో కోనసీమ ప్రాంతం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని అడుగుల మేర పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. పలు విమానాలు రద్దయ్యాయి. ప్రయాణీకులు ఎయిర్ పోర్టులలో పడిగాపులు కాశారు. పలు రైళ్లు రద్దు కాగా, కొన్నింటిని దారి మళ్లించారు. 47 ప్యాసింజర్ రైళ్లు, 3 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఎడతెరిపి లేకుండా వర్షాలు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ నియోజకవర్గంలో వరి, మిర్చి పంటలకు తీవ్రనష్టం జరిగింది. వీరులపాడులో ఇప్పటి వరకు ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది. కంచికచర్ల మండలంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఇంజాపూరంలో 117.5 మిల్లీ మీటర్ల వర్షం, ఉప్పలగుప్తంలో 117.5 మి.మి. వర్షం, ఆర్యవటంలో 84.25 మి.మి. వర్షం, విశాఖపట్నంలోని నిన్నిమామిడివలసలో 63 మి.మి. వర్షం, కృష్ణా జిల్లాలోని వెలగలేరులో 56.5 మి.మి. వర్షపాతం నమోదయింది. కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి.
పెథాయ్ కారణంగా ఒకరి మృతి
పెథాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడలో ఓ వ్యక్తి చనిపోయాడని తెలుస్తోంది. తీర ప్రాంతంలోని పలు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. తుఫాను కాట్రేనికూన వద్ద తీరం దాటింది. ఇక్కడకు మంత్రి నారాయణ చేరుకున్నారు. 18 మండలాల్లోని 295 గ్రామాల్లో పునరావాస చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 84 జేసీపీ, 83 జనరేటర్లు, 87 వాటర్ ట్యాంకర్లు సిద్ధం చేశామన్నారు. బియ్యం, చక్కెర, పప్పు, పామాయిల్ కూడా సిద్ధంగా ఉంచామన్నారు. కాకినాడ, అమలాపురంలో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆహారం, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్కు ఆదేశించినట్లు చెప్పారు.
చిగురుటాకులా వణికిన కోస్తా
పెథాయ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికాయి. రెండు మూడు రోజులుగా ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అవసరమైన జనరేటర్లు, నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. వంట గదులను సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామగ్రితో రంగంలోకి దిగాయి. నౌకాదళం, కోస్ట్ గార్డు విభాగాలను అప్రమత్తం చేశారు.