ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం
విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని వేగం గంటకు 12 కిలోమీటర్లుగా నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దీని కదలికలు ఉన్నాయని చెప్పారు. ఫలితంగా- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ శ్రీకాకుళం జిల్లాలో ప్రచండవేగంతో గాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాఢాంధకారం నెలకొంది. కంటి మీద కునుకు లేకుండా గడిపారు ఆయా గ్రామాల ప్రజలు. సముద్రానికి సమీపంలో ఉన్న కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంత బొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, శ్రీకాకుళం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఒడిశా సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురంపై ఫొని తుఫాను పెను ప్రభావం పడింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సోంపేటలో గరిష్ఠంగా 10 సెంటీమీటర్ల. వర్షపాతం నమోదైంది. ముందుజాగ్రత్త చర్యగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. శ్రీకాకుళం, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కంచిలిలో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు.
తుఫాన్ ధాటికి అల్లకల్లోలం..
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినట్టే.. గురువారం రాత్రంతా భారీ వర్షాలు నమోదయ్యాయి. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంత రోడ్ల మార్గాలు కోసుకుపోయాయి. ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు ధ్వంసం అయ్యాయి.
సూపర్ సైక్లోన్ గా రూపాంతరం
ఫొని తుఫాన్ ఒడిశా తీరానికి సమీపిస్తున్న కొద్దీ సూపర్ సైక్లోన్ గా ఆవిర్భవించిందని అధికారులు తెలిపారు. తీరాన్ని తాకిన సమయంలో అంచనాలకు మించిన విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీరాన్ని తాకిన సమయంలో 200 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని, ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒడిశాపై తుఫాన్ ప్రభావం పడింది. చిలుకా సరస్సు ప్రాంతం అతలాకుతలమౌతోంది.