దూసుకొస్తున్న ఫొణి : చంద్రబాబు ఆరా.. ఉత్తరాంధ్రలో అప్రమత్తం : ఉద్యోగుల సెలవుల రద్దు...!
ఫొణి పెను తుఫాన్గా మారింది. పశ్చిమ మధ్య..నైరుతి బంగాళాఖాతానని అనుకుని కొనసాగుతోంది. ఏపి ప్రభుత్వం ఈ తుఫాను పైన అధికారులను అలర్ట్ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. గతంలో వచ్చిన తుఫాన్ల కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యల పైన ఆరా తీసారు. సీఎస్..ఆర్టీజీయస్ అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పెను తుఫాన్గా ఫొణి..
ఫొణి పెను తుఫానుగా మారి ఉత్తరాంధ్రలో ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూరికి దక్షిణ దిశగా 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో ఫణి కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి మధ్యాహ్నం ఒడిశాలోని.. గోపాల్పూర్, చంద్బలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 175 నుంచి 180 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. 205 కి.మీల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
చంద్రబాబు ఆరా..
ఫొణి తుపానుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆర్టీజీఎస్ సీఈవో నుంచి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపానుపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆర్టీజీయస్ అధికారులు ఎప్పటికప్పడు జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లాలో అయిదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అధికారుల సెలవున్నింటినీ రద్దు చేశారు.. 6 వేల ఎలక్ట్రికల్ పోల్స్ సిద్ధంగా ఉంచటంతో పాటుగా కమ్యునికేషన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాం. 48 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసామని జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎస్ నిరంతర సమీక్ష..
ఫొని తుపాను సహాయక చర్యలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గండ్లు పడే చోట పునర్నిర్మాణం చేపట్టాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 65 గ్రామాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసారు. నిత్యవసరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ అదేశాలు జారీ చేసారు.