Cyclone Jawad : తరుముకొస్తున్న తుఫాన్-ఉత్తరాంధ్ర హై అలర్ట్-స్కూళ్లకు సెలవులు
ఏపీపై జవాద్ తుపాను ప్రభావం తీవ్రమవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఇప్పటికే బలపడింది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎల్లుండి ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు తుపాను చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తుపాను ప్రభావంతో రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి.
Recommended Video
ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలుస్తోంది. దీంతో మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.