దూసుకొస్తున్న లెహర్: సిఎం కోస్తా పర్యటన రద్దు
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర పెను తుపాను లెహర్ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం లెహర్ తుపాను పోర్టు బ్లేయర్కు పశ్చిమ-వాయువ్య దిశలో 300 కిలో మీటర్లు, మచిలిపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 1030 కి.మీ, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 970, కళింగ పట్నానికి ఆగ్నేయ దిశలో 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
నవంబర్ 28 గురువారం మధ్యాహ్నం వరకు మచిలీపట్నం, కళింగపట్నం దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. కాగా లెహర్ తీవ్ర పెను తుపాను నేపథ్యంలో రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఎల్లో మెసేజ్ కొనసాగుతోంది. లెహర్ తుపాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం తలపెట్టిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనను నవంబర్ 29,30కి వాయిదా వేసుకున్నారు.
లెహర్ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోస్తా ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని వారికి ఆదేశాలను జారీ చేశారు. తుపాను ప్రభావం ఉత్తరాంధ్రకు ఎక్కువ ఉన్నందున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతితో సమీక్ష నిర్వహించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో కోస్తా తీరంలో 50 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా, ఒడిశా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతో ప్రారంభమైన తుపాను ప్రభావం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 27, 28 తేదీల్లో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాన్ని తుపాను తాకే అవకాశం ఉందని పేర్కొంది.