Nivar Cyclone Effect ఏపీ అతలాకుతలం- సీఎం జగన్ సమీక్ష- నేటి కేబినెట్లోనూ చర్చ..
నిన్న తెల్లవారుజామున తమిళనాడులోని మమళ్లాపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటిన నివర్ తుపాను తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీకి కూడా భారీ నష్టం చేసింది. ముఖ్యంగా తుపాను తీరం దాటిన సమయంలో మొదలైన వర్షాలు ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలను ముంచెత్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలపైనా తుపాను ప్రభావం కనిపించింది.
నివర్ తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగింది. తుపాను తీరం దాటిన సమయంలో కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోనూ పంట నష్టం తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే వెయ్యికోట్లకు పైగా పంట నష్టం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
నివర్ తుపాను సందర్భంగా ప్రాణనష్టాన్ని అరికట్టగలిగినా పంట నష్టం భారీగా ఉండటంపై సీఎం జగన్ సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావంపై ఇవాళ్టి కేబినెట్ భేటీలోనూ చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం మరోసారి అప్రమత్తమవుతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో జరగబోయే నష్టాన్ని తలుచుకుని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తీరం దాటిన తర్వాత 'నివర్' బలహీనపడి వాయుగుండంగా మారింది. శుక్రవారం ఉదయానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది తిరుపతికి పశ్చిమ నైరుతి దిశగా 30 కి.మీ., చెన్నైకి పశ్చిమవాయువ్య దిశగా 115 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గంటకు 55-75కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శుక్రవారమూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడవ నంబరు భద్రతా సూచిక కొనసాగుతోంది.