నివర్ ఎఫెక్ట్ : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- పెరిగిన చలి గాలుల తీవ్రత
ఏపీలో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను తీరం దాటిపోవడంతో ముప్పు తప్పిందని భావించినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరుతోంది. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఈ తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్ మధ్య తీరం దాటిన నివర్ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న సాయంత్రం నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. అర్ధరాత్రి తుపాను తీరం దాటిన సమయంలో మొదలైన వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని గోదావరి జిల్లాల నుంచి మొదలుపెట్టి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
భారీవర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా.. విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అదే సమంయలో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. ఓవైపు భారీవర్షాలు పడుతున్నా చలిగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్దితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. తుపాను తీరం దాటినా బలహీన పడే క్రమంలో వర్షాలు, చలిగాలులు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
భారీ వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్న పలు జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. రెండురోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో నుంచి రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మత్సకారులను నిన్నటి నుంచే వేటకు వెళ్లడాన్ని నిషేధించారు. స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.