నివర్ ఎఫెక్ట్: రైతుల పాలిట కన్నీటి వాన..అటు చెన్నై ఇటు ఏపీలో వర్ష బీభత్సం
నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. నివర్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై మహానగరం తోపాటుగా, 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలోనూ నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. వర్షాలకు తోడు, చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక రైతులు లబోదిబోమంటున్నారు.
తమిళనాడులోని 13 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో నివర్ కల్లోలం
ఇప్పటికే చెన్నైలో జనాన్ని రోడ్లపైకి రాకుండా రాకపోకలు నిషేధించారు. నెల్లూరు నగరం వర్ష ప్రభావంతో ప్రస్తుతం చెరువును తలపిస్తోంది. నివర్ అతి తీవ్ర తుఫానుగా రూపు దాల్చడంతో అటు తమిళనాడు, ఇటు ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి . తమిళనాడులోని 13 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం , కడప ,కర్నూలు, చిత్తూరు జిల్లాలో నివర్ తుఫాన్ వల్ల కలిగే నష్టం అపారంగా ఉండనుందని తెలుస్తుంది. ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసిన అన్నదాతలు ఇప్పుడు తుఫాన్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నారు.
గత భారీవర్షాలతో పంటలు మునిగిపోయి నష్టం .. మళ్ళీ ఇప్పుడు నివర్ దెబ్బ
నివర్ తుఫాను ప్రభావంతో గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు జిల్లాలో గాలుల వేగం గంటకు 65 కిలోమీటర్ల నుండి 85 కిలోమీటర్ల దాకా ఉండొచ్చని వాతావరణ విభాగం చెబుతోంది. నివర్ ప్రభావంతో ఏపీలో మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ రైతాంగం తీవ్రంగా దెబ్బతింది . ఇప్పటివరకు గత భారీవర్షాలు, వరదల దెబ్బ నుండి బయటపడలేదు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నివర్ వచ్చి పడింది.
Recommended Video
పంట చేతికి వచ్చే సమయానికి రైతుల ఆశలపై నీళ్ళు చల్లిన నివర్
ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉన్న కారణంగా ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతులు మళ్లీ వర్షాలు పడుతుండడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు . నివర్ తుఫాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వరి పంట సాగు చేసిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వరి పంట నూర్పిడి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు శరాఘాతంగా మారాయి.