ఏపీలోనూ నివర్ తీవ్ర ప్రభావం- విమానాల రద్దు- స్కూళ్లకు సెలవులు, పరీక్షల వాయిదా
ఏపీలోనూ నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అర్దరాత్రి తీరం దాటిన సమయంలో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. తుపాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. కోస్తా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి.
పలు జిల్లాల్లో చలి గాలుల తీవ్రత బాగా పెరిగింది. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలకు విజయవాడ ఎయిర్పోర్టులో విమానాలు రద్దయ్యాయి. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
నెల్లూరు, చిత్తూరులో వర్షాలే వర్షాలు
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంటలేరు వాగు ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తోంది. కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పించ డ్యామ్ భారీ వర్షంతో నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అటు తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయం అయ్యాయి. మాడ వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. ఆలయం ముందు వరద ప్రవాహం కనిపిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని పలు మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. వరదాయపాళెంలో అరుణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాముల కాలువ-సంతవేలూరు-వరదాయపాళెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలోని పలు డ్యామ్లకు నీరు పొటెత్తుతోంది. గోగర్బం డ్యామ్ నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అరణియర్ ప్రాజెక్టులోకి కూడా నీరు భారీగా చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి నీరు వదిలేశారు.
కర్నూల్లో భారీ వర్షాలు..
కర్నూలు జిల్లాలో నివర్ తుపాను కారణంగా ఇవాళ, రేపు కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులు తెలిపారు. తుపానును ఎదుర్కొనేందుకు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు గ్రామ, మండల స్ధాయి నుంచి జిల్లా స్దాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీరపాండియన్ కోరారు. కర్నూల్లో తుపాను సహాయక చర్యల కోసం కర్నూలు కలెక్టరేట్తో పాటు నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కర్నూలు కలెక్టరేట్- 08518-277305,
నంద్యాల
ఆర్డీఓ
కార్యాలయం:
08514-221550/8333989013
ఆదోని
ఆర్డీఓ
కార్యాలయం:
8333989012
కర్నూలు
ఆర్డీఓ
కార్యాలయం
-
8333989011
నంబర్లలో
అధికారులను
అందుబాటులో
ఉంచారు.
కడపలో స్కూళ్లు సెలవు, పరీక్షలు వాయిదా..
నివర్ తుపాను కారణంగా కడప జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ హరికిరణ్ సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ ఇది వర్తిస్తుందన్నారు. కడప జిల్లాలో భారీవర్షాలు, ఈదురుగాలులతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో నేడు జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే మిగతా పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా వాయిదా పడినట్లువైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పి.పద్మ తెలిపారు.
Recommended Video
విజయవాడలో విమానాల రద్దు..
నివర్ తుపాను కారణంగా విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి వాతావరణం చల్లగా మారిపోయింది. వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే చెన్నై, బెంగళూరు సర్వీసులు రద్దయ్యాయి. రే్పు మిగిలిన సర్వీసులు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.