రేపు తీరం దాటనున్న నివర్ తుపాను- దక్షిణకోస్తా, రాయలసీమపై ఎఫెక్ట్- ఏపీ అంచనా
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భీకరమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివర్ తుపాను ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతోంది. దీంతో రేపు ఉదయం కల్లా ఇది తీరం దాటొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉండనున్నట్లు చెబుతోంది.
ఏపీపైనా నివర్ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులు
దూసుకొస్తున్న నివర్ ముప్పు...
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మూడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందులో తమిళనాడు, పుదుచ్చేరిపై నేరుగా ప్రభావం చూపుతుండగా.. ఏపీపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. పుదుచ్చేరికి సమీపంలో ఉన్న తమిళనాడులోని మామళ్లాపురం- కరైకల్ తీరాల మధ్య తుపాను పయనిస్తోంది. ఇది రాత్రి కల్లా తీవ్ర తుపానుగా బలపడబోతోంది. దీంతో తీరానికి సమీపంలో 65 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు భారీగా ఎగసిపడున్నాయి. కోస్తా తీరం మొత్తం అల్లకల్లోలంగా మారడంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధాజ్ఞలు కూడా విధించారు. తుపాను ప్రభావంతో మూడు రాష్ట్రాల పరిధిలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
రేపు తీరం దాటనున్న నివర్...
ప్రస్తుతం గంటకు కేవలం 6 కిలోమీటర్ల వేగంతోనే తుపాను కదులుతుంది. తీరానికి దాదాపు 300 నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను తీరం దాటాలంటే కనీసం మరో 12 గంటలు పట్టే అవకాశముంది. దీంతో రేపు తెల్లవారు జామున నివర్ తుపాను తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు మూడు రాష్ట్రాల పరిధిలోనూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో భారీగా ఆస్తినష్టం లేకుండా చూసేందుకు ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం..
నివర్ తుపాను ప్రభావం ఏపీపైనా పడుతోంది. భారీగా కాకపోయినా ఓ మోస్తరుగా తుపాను ప్రభావం ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తుపాను ప్రభావం దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలపై ఉండొచ్చిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. వచ్చే 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని, రేపు తెల్లవారు జామున తమిళనాడులో తీరం దాటుతుందని వెల్లడించింది. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి. నెల్లూరు, ప్రకాశంతో పాటు చిత్తూరు జిల్లాపైనా నివర్ ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. తిరుమలలో ఉదయం నుంచీ భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు హై అలర్ట్ కూడా ప్రకటించారు. దక్షిణకోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం కూడా పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.