పెథాయ్ తుఫాను: ఏపీలోని 9 జిల్లాల్లో హైఅలర్ట్, రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం
Recommended Video
అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను ఆధివారం మధ్యాహ్నం తీవ్ర తుఫానుగా మారింది. సాయంత్రానికి చెన్నైకి 410 కిలో మీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం విశాఖపట్నం - తుని వద్ద తీరం దాటే అవకాశముంది.
గంటకు 19 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. తుపాను కారణంగా తీరం వెంబడి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను సమీపించే కొద్దీ 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. మూడు నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. సచివాలయంలోని ఆర్టీజీఎస్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా తుపాను హెచ్చరికల సందేశాలను జారీ చేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆర్టీజీఎస్, ఎస్డీఎంఏ ద్వారా సమీక్షిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిరవ్వహించారు. ప్రతి ఏటా మన రాష్ట్రానికి తుఫాన్లు పరిపాటి అన్నారు. వాటిని ఎదుర్కోవడంలోనే సవాళ్లు అన్నారు. ఈ ఏడాది ఇది మూడో తుఫాను అని చెప్పారు. మొన్న టిట్లీ, నిన్న గజ, ఇప్పుడు పెథాయ్ తుఫాను వస్తోందని చెప్పారు. గతంలోని లోపాలు పునరావృతం కావొద్దని అధికారులకు సూచించారు.
కాగా, ప్రభుత్వం 9 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తీరం దాటే సమయంలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎన్టీఆర్ఎఫ్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉంది.