కాకినాడ-యానాం మధ్య తీరం దాటనున్న తుఫాను: పెనుగాలులు, భారీ వర్షాలు
అమరావతి/కాకినాడ/విశాఖపట్నం: పెథాయ్ తుఫాను కాసేపట్లో కాకినాడ - యానం మధ్య తీరం దాటనుంది. పెథాయ్ తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. చెట్లు నేలకు కూలాయి. విశాఖపట్నం, కాకినాడలలో తుఫాను బీభత్సం బాగా ఉంది. ఈ ప్రభావం మరో రెండు గంటల వరకు ఉండనుంది.
పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి. తుఫాను ప్రభావం కారణంగా కోనసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మూడు అడుగులకు పైగా నీళ్లు రోడ్ల పైనే నిలిచాయి. పెథాయ్ తుఫాను కారణంగా పలు విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. ప్రయాణీకులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్లు ఆర్టీజీఎస్లో కూర్చొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెథాయ్ తుఫాను పరిస్థితులను ఎప్పటికి అప్పుడు సమీక్షించాలని సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
పెథాయ్ తుఫాను మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని 350 గ్రామాలతో పాటు బెంగాల్లోని పలు గ్రామాలపై భారీగా ప్రభావం పడనుంది.