టిట్లీ బీభత్సం: బాధితుల ఆవేదన ఎవరికీ పట్టదా?, కంటతడి పెడుతున్న శ్రీకాకుళం
Recommended Video
విజయనగరం/శ్రీకాకుళం: టిట్లీ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఎదురుచూస్తున్న అనేక గ్రామాల్లో బాధితులకు ఇప్పటికీ నిరాశే మిగులుతోంది. కనీసం తినడానికి కూడా ఏమీ లేక ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది.
టిట్లీతో భారీ నష్టం, రూ.1200కోట్లు ఇవ్వండి: మోడీకి చంద్రబాబు లేఖ, బైక్పై లోకేష్ పర్యటన
ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ బాధితుల వద్దకు చేరకపోవడం గమనార్హం. దీంతో బాధితులు తీవ్ర ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కన్నీటి వేదన ఎవరికీ పట్టదా? అంటూ నిలదీస్తున్నారు.
ఆందోళన బాధితులు
‘వేలాది ఇళ్లు కూలిపోయి కుటుంబాలకు కుటుంబాలే కట్టుబట్టలతో చెట్ల కింద, పరాయి పంచన ఉంటున్నారు. ఇంకా వర్షం కురిస్తే మా పరిస్థితి ఏమిటి' అని తుఫాను బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో భయాందోళనలకు గురవుతున్నారు.
బీభత్సం సృష్టించిన తుఫాను
కాగా, టిట్లీ తుఫాను దెబ్బకు శ్రీకాకుళంలో జిల్లాలనే అనేక ప్రాంతాలతోపాటు ముఖ్యంగా ఉద్దానం కకావికలైంది. జీడి, కొబ్బరి చెట్లు నేలమట్టయ్యాయి. తుఫాను ధాటికి ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. టిట్లీ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వర్షాలు ఉద్దానం వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
జీవనాధారాన్ని తుడిచిపెట్టేసింది..
ఉద్ధానంలో వేలాది రైతు కుటుంబాలకు కొబ్బరి చెట్లే జీవనాధారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నింటికీ కొబ్బరి పంటే కొండంత అండ. అలాంటి కొబ్బరి తోటలన్నింటినీ టిట్లీ తుఫాను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. దాదాపు 90 శాతం కొబ్బరి తోటలు కకావికలమైపోయాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్న తోటల్లో కూలిన చెట్లను ఖాళీ చేయించుకోవడానికీ కొత్తగా అప్పులు చేయాల్సిందే. మళ్లీ కొత్తగా మొక్కలు నాటుకున్నా ఆ పంట రావడానికి ఏళ్లు పడుతుంది.
ప్రభుత్వం ఆదుకోకపోతే..
ఉద్దానం, పరిసర మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఇక్కడి కొబ్బరిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. సాధారణంగా ఎకరానికి 80 నుంచి 90 చెట్లుంటాయి. అలాంటిది అత్యధిక తోటల్లో కనీసం ఒకటి రెండు చెట్లైనా మిగలని పరిస్థితి నెలకొంది. ఒక కొబ్బరి మొక్క నాటిన తరువాత కనీసం ఏడెనిమిదేళ్లకుగానీ కాపు మొదలు కాదు. అప్పటి నుంచి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల వరకూ ఏడాదికి ఆరు విడతలుగా కాయలనిస్తుంది. ఎకరానికి ఏడాదికి దాదాపు రూ.72,000 వరకూ ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం తగిలిన దెబ్బతో రైతుకు ఆదాయం పోవడంతో పాటు అదనంగా అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటివరకూ ఉన్న అప్పుల్నే తీర్చలేని స్థితిలో ఉన్న రైతన్నకు కొత్త అప్పులు ఎలా పుడతాయన్నది ప్రశ్నార్థకమే. అందుకే ప్రభుత్వం తగిన సాయం చేయకపోతే ఉద్దానం కొబ్బరి రైతుల పరిస్థితి దుర్భరం కానుంది.
విపత్కర పరిస్థితుల్లోనూ దోపిడీ...?
టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా రూ.5 ఉన్న కోడిగుడ్డు రూ.10 పలుకుతోంది. 25 లీటర్ల మంచినీరు క్యాన్ రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. కిలో టమాటాలను రూ.40 నుంచి 50 వరకూ అమ్ముతున్నారు. కూరగాయల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయని.. దీంతో పచ్చడితో సరిపెట్టుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. కాగా, లూజులో పెట్రోలును లీటర్ రూ.150కి అమ్ముతున్నారని.. వంటగ్యాస్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, నాలుగో రోజు ఆదివారం కూడా 1300 పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో వేలాడుతున్న కరెంటు తీగలపై గ్రామస్తులు దుస్తులు ఆరేశారు.
మరో రెండ్రోజులు వర్షాలు
కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం జారీ చేసిన హెచ్చరికలు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం వాసులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే టిట్లీ తుఫాను ధాటికి తోటలు, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన తాము వర్షం వస్తే ఎక్కడ తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.