తీవ్ర రూపం దాల్చిన ‘టిట్లీ’ తుఫాను: ఏపీ, ఒడిశాల్లో రెడ్ అలర్ట్, తీరం దాటే అవకాశం
విశాఖపట్నం: ఒడిశా తీరంతోపాటు ఉత్తర కోస్తాను టిట్లీ తుఫాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. గురువారం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-సంతబొమ్మాళి మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
టిట్లీ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలం, భారీ వర్షాలు: తీర ప్రాంతాలకు హెచ్చరిక
తీవ్ర తుఫానుగా టిట్లీ..
ఒడిశా తీరంతోపాటు ఉత్తరాంధ్రకు తీవ్ర తుఫాను ముప్పు పొంచి ఉందని, ‘టిట్లీ' తుఫాను మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం.. కళింగపట్నానికి ఆగ్నేయంగా 270కి.మీ, గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 320కి.మీల దూరంలో ఈ తీవ్ర తుఫాను కేంద్రీకృతమైఉంది. ఈ సాయంత్రంలోగా అతి తీవ్ర తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయణించనుంది.
భారీ వర్షాలు, బలమైన గాలులు.. హెచ్చరికలు జారీ..
ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. టిట్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్పూర్కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశముందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గురువారం రాత్రి, రేపు ఉత్తరాంధ్రలో 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అలలు 7 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశాలున్నాయని.. ప్రజలు సముద్ర తీరం వద్దకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ జిల్లాలు అప్రమత్తం.. రైళ్ల దారి మళ్లింపు..
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, లావేరు, రణస్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పొందూరు, సంతకవిటి, జి.సిగడాం మండలాలు.. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, పూసపాటిరేగ, గరివిడి, నెల్లిమర్ల, గుర్ల, విజయనగరం, డెంకాడ, భోగాపురం, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, దత్తి రాజేరు.. విశాఖపట్నం జిల్లాలో బీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, విశాఖ రూరల్ మండలాలపై ప్రభావం పడే అవకాశముంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్-హవ్డా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, బిలాస్పూర్ మీదుగా దారి మళ్లించారు. విజయనగరం జిల్లాకు వెళ్లే పలు రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
సురక్షిత ప్రాంతాలకు
టిట్లీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ ధనంజయరెడ్డి చెప్పారు. ఈ సాయంత్రం నుంచి తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు.
ఒడిశా తీర ప్రజలకు హెచ్చరిక
ఒడిశా, ఉత్తరాంధ్రకు ఆనుకుని గోపాల్పూర్- కళింగపట్నం మధ్య గురువారం ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. బుధవారం ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, అక్కడక్కడ భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 110 నుంచి 135 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. నేటి సాయింత్రం నుంచి రేపు ఉదయంలోగా దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్రకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో 140 నుంచి 165 కి.మీ వేగంతో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశా తీర ప్రాంతంలో తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
కాగా, తుఫాను పరిస్థితుల కారణంగా ముందస్తుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. యశ్వంత్పూర్ - హౌరా, హౌరా-ఖరగ్పూర్ రైళ్లతో పాటు పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నామంది. విజయనగరం-కుర్దా మార్గంలో ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేశామంది. అటు ఒడిశాలో శుక్రవారం ఆర్ఆర్బి పరీక్షనూ వాయిదా వేసినట్లు రైల్వేబోర్డు వెల్లడించింది.